Isudan Gadhvi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదన్ గాద్వీని ప్రకటించారు. ఇసుదన్ గాద్వీ ఆప్ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ. ఆయన గుజరాత్లో రాజకీయంగా ప్రభావవంతమైన ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడు.
Gujarat Assembly Election: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గాద్వీని అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ-మెయిల్ ద్వారా పార్టీని సంప్రదించాలని గత వారం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. ఈ క్రమంలోఏ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఇసుధన్ గద్వీని గుజరాత్ లో ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ జర్నలిస్ట్, టీవీ యాంకర్ అయిన ఇసుదన్ గద్వీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే దానిపై ఆప్ నిర్వహించిన సర్వేలో 73 శాతం ఓట్లు సాధించారు.
ఎవరీ ఇసుదన్ గాద్వీ..?
- 40 ఏళ్ల ఇసుదాన్ గాధ్వి ద్వారకా జిల్లా పిపాలియా గ్రామంలో ఆర్థికంగా మంచి రైతు కుటుంబానికి చెందిన నాయకుడు.
- ఇసుదన్ గాద్వీ ఆప్ జాతీయ జాయింట్ జనరల్ సెక్రటరీ. ఆయన గుజరాత్లో రాజకీయంగా ప్రభావవంతమైన ఓబీసీ వర్గానికి చెందిన నాయకుడు.
- ఇసుదన్ గాద్వీ తన జర్నలిజం వృత్తిని ప్రముఖ దూరదర్శన్ షో 'యోజన'లో ప్రారంభించాడు.
- ఇసుదన్ గాద్వీ గుజరాత్లోని అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ జర్నలిస్టులు, యాంకర్లలో ఒకరు.
- VTV న్యూస్లో అతని షో 'మహామంథన్' రాత్రి 8-9 గంటల నుండి నడుస్తుంది. అయితే ప్రజాదరణ పొందిన డిమాండ్తో రాత్రి 9.30 వరకు పొడిగించబడింది.
- గుజరాత్లోని డాంగ్-కపరాడ తాలూకాలలో ₹ 150 కోట్ల అక్రమ అటవీ నిర్మూలన కుంభకోణాన్ని తన వార్తా కార్యక్రమంలో బహిర్గతం చేసిన తర్వాత ఇసుదన్ గాద్వీ కి మంచి గుర్తింపు, పేరు వచ్చింది. ఆ గుజరాత్ ప్రభుత్వం చర్య తీసుకోవలసి వచ్చింది.
- జూన్ 2021లో, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఇసుదన్ గాద్వీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లో చేరారు.
- గుజరాత్ లో ఓబీసీ వర్గాలకు చెందిన వారు దాదాపు 48 శాతంపైగా ఉన్నారు. ఈ వర్గాలకు చెందిన ఇసుదన్ గద్వీ ఆప్ ముఖ్యమంత్రిగా ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశముంది.
- "అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో నాలాంటి నిరాడంబరమైన రైతు కుమారుడికి ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు" అని ప్రకటన తర్వాత ఉద్వేగభరితమైన ప్రసంగంలో ఇసుదన్ గద్వీ అన్నారు.
- "నేను చేయగలిగినంత ఉత్తమంగా చేయడానికి ప్రయత్నిస్తాను. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నేను నా తోటి గుజరాతీలకు కావాల్సినవన్నీ ఇవ్వాలనుకుంటున్నాను...నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తాను" అని ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇసుదన్ గాద్వీ మీడియాతో అన్నారు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 10 మంది అభ్యర్థులతో కూడిన తొమ్మిదో జాబితాను ఆప్ గురువారం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 118కి చేరుకుంది. 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే నెలలో రెండు దశల్లో జరుగుతాయి. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్లు లెక్కింపు డిసెంబర్ 8 ఉంటుందనీ, ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది.
