ఆటో రిక్షా,బైక్ను ఢీకొట్టిన ఎస్యూవీ.. ఆరుగురు మృతి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడిపై కేసు నమోదు
Gujarat: గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో వేగంగా వెళ్తున్న ఎస్యూవీ.. ఆటో రిక్షా, మోటర్బైక్ను ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు కేతన్ పాధియార్ కు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. ఆయన పై కేసు నమోదుచేశారు.
Gujarat road accidents: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువు తన ఎస్యూవీని వేగంగా పోనిస్తూ.. ముందు వెళ్తున్న ఒక బైక్, ఆటోరిక్షాను ఢీకొట్టారు. ఖేతన్ పాధియార్పై నేరపూరిత హత్య కింద కేసు నమోదు చేశారు.
స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో గురువారం సాయంత్రం వేగంగా వెళ్తున్న ఎస్యూవీ ఆటో రిక్షా, మోటార్బైక్ని ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. సోజిత్రా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పునంభాయ్ మాధభాయ్ పర్మార్ అల్లుడు ఖేతన్ పాధియార్ తన ఎస్యూవీని వేగంగా పోనిస్తూ.. వాహనాలను ఢీకొట్టాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖేతన్ పాధియార్పై నేరపూరిత మానవ హత్య కింద కేసు నమోదు చేశారు.
సోజిత్రా గ్రామం సమీపంలోని తారాపూర్తో ఆనంద్ పట్టణాన్ని కలిపే రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. "ఆనంద్ జిల్లాలో రాత్రి 7 గంటల సమయంలో కారు, బైక్, ఆటో రిక్షా మధ్య జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఆటోలో నలుగురు వ్యక్తులు, బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది అని ఆనంద్ జిల్లాకు చెందిన ASP అభిషేక్ గుప్తా వెల్లడించినట్టు ఏఎన్ఐ నివేదించింది. సోజిత్రా హైవేపై వేగంగా వస్తున్న కియా సెల్టోస్ ఎస్యూవీ ఆటోరిక్షాను, ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను సోజిత్రాలోని నవగఢ్ గ్రామానికి చెందిన జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీ, వారి తల్లి వినబెన్ మిస్త్రీ, ఆటోరిక్షా డ్రైవర్ యాసన్ వోహ్రా, ఆనంద్ ప్రాంతానికి చెందిన యోగేష్ ఓడ్, సందీప్ ఓడ్గా గుర్తించారు.
వినబెన్, జియా, జాన్వీలు ఆటోరిక్షాలో, యోగేష్, సందీప్ మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్నారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు జిల్లాలోని సోజిత్రా, బోరియావి గ్రామాల వాసులు అని స్థానిక పోలీసు అధికారులు పీటీఐకి తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు మాట్లాడుతూ, "నిందితుడిని అరెస్టు చేశారు. IPC సెక్షన్ 304 కింద కేసు నమోదుచేశాం. చనిపోయిన ఆరుగురి వివరాలు గుర్తించాము. నిందితుడు కేతన్ పాధియార్ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు" అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు స్పందిస్తూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. “ఇది కాంగ్రెస్ నిజమైన ముఖం” అని ట్వీట్ చేశారు. మృతి చెందిన ముగ్గురు మహిళలు రక్షాబంధన్ను జరుపుకుని తిరిగి వస్తుండగా ఆనంద్కు చెందిన సోజిత్రా సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువులు నడుపుతున్న కారు నంబర్ప్లేట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్నవారికి మద్యం పరీక్ష కూడా నిర్వహించినట్టు సమాచారం.