అన్ని అంశాలపై చర్చకు సిద్దమే: ఆల్పార్టీ మీటింగ్లో మోడీ
ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ ఆదివారం నాడు పాల్గొన్నారు. ప్రతి అంశంపై అర్ధవంతమైన చర్చకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో వివిధ అంశాలపై ఆరోగ్యకరమైన, అర్ధవంతమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పురస్కరించుకొని ఆదివారం నాడు ఆఖిలపక్షంతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోడీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు చెప్పారు.
ఈ సమావేశంలో 33 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల నుండి వచ్చిన సూచనలు విలువైనవిగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో అధికార పార్టీ నేత పీయూష్ గోయల్ తదితరులు పాల్గొన్నారు.లోక్సభలో విపక్షనేత అధిర్ రంజన్ చౌధురి, రాజ్యసభలో విపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే కూడ సమావేశంలో పాల్గొన్నారు.టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రెయిన్, డిఎంకె నుండి తిరుచి శివ, ఎస్పీ నుండి రామ్గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన సతీష్ మిశ్రాతో పాటు ప్రముఖ విపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
అప్నాదళ్ నేత, ఎన్డీఏ మిత్రపక్ష నేత అనుప్రియ పటేల్, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ కూడ హాజరయ్యారు.ఈ నెల 19 నుండి ఆగష్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులను ప్రధాని మోడీ సభకు పరిచయం చేయనున్నారు. ఇటీవలనే ప్రధాని మోడీ మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ఎంపీలు కూడ ఈ సమావేశాల్లో ప్రమాణం చేయనున్నారు.