కేరళలో.. డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ గా గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తొలగింపు..
కేరళ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గవర్నర్ ను ఓ డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ బాధ్యతలనుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేరళ : కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. కేరళ కలమండలం డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ బాధితుల నుంచి ఆరిఫ్ ఖాన్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సాంస్కృతిక కళారంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని నియమించేలా విశ్వవిద్యాలయ నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
దక్షిణాదిలో బీజేపీ అధికార పార్టీలు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తమిళనాడు గవర్నర్ గా ఆర్ఎస్ రవిని తొలగించాలని అధికార డీఎంకే పార్టీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆరిఫ్ ఖాన్ ను రాష్ట్రంలోని యూనివర్సిటీల ఛాన్స్ లర్ బాధ్యతల నుంచి తప్పించేందుకు వీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్ కోసం నిన్ననే కేరళ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అంతేకాకుండా తన ఫోన్ టాపింగ్ కు గురవుతుందంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం నిన్న చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దక్షిణాది రాజకీయాల్లో కీలక ప్రాధాన్యత సంతరించుకుంది.
కొద్ది రోజుల క్రితం 11 యూనివర్సిటీలో ఉపకులపతులురాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశాలిచ్చారు. దీన్ని రాష్ట్ర సర్కారు తీవ్రంగా వ్యతిరేకించింది. గవర్నర్ కు అలా ఆదేశాలిచ్చే అధికారాలు లేవని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గవర్నర్ తీరును తప్పు పట్టారు. తర్వాత ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ ను పదవి నుంచి తొలగించాలంటూ గవర్నర్ లేఖ రాయడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ రాజ్ భవన్ వేదికగా సమాంతర ప్రభుత్వాన్ని నడపాలని ప్రయత్నిస్తున్నారని అధికారిక సిపిఎం గవర్నర్ చర్యలు తప్పుపట్టింది. తాజాగా ఆయనను ఓ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా, కేరళ గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య వివాదం గత కొద్దికాలంటా కొనసాగుతూనే ఉంది. వీరు ఇద్దరు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను, అక్కడి పరిస్థితులను వేడెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నవంబర్ 3న ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు సవాల్ విసిరారు. తన రాజకీయ జోక్యానికి ఒక్క ఉదాహరణ చూపాలని, సీఎం ఒక ఉదాహరణ చూపితే తాను రాజీనామా చేస్తానని గవర్నర్ అన్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్స్ లర్ల నియామకంలో రాజకీయం జోక్యంఉందంటూ సీఎం పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తోసిపుచ్చారు. అలాగే బంగారం స్మగ్లింగ్ స్కామ్ మీద ముఖ్యమంత్రి పినరాయి విజయన్ పై పలు ఆరోపణలు గుప్పించారు.