అమ్మాయిల కనీస వివాహ వయసు: ప్రధాని మోడీ కీలక ప్రకటన
భారతదేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రధాని నరేంద్రమోడీ. దీనిపై ఇప్పటికే కమిటీ వేశామని, నిపుణులు నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు
భారతదేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రధాని నరేంద్రమోడీ. దీనిపై ఇప్పటికే కమిటీ వేశామని, నిపుణులు నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేసిన సమయంలో ప్రధాని మాట్లాడారు.
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో నమోదు చేసుకుంటున్న వారిశాతం బాలురతో పోలిస్తే బాలికలదే అధికంగా ఉందని, ఇలా పెరగడం దేశంలో ఇదే తొలిసారని నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు.
గడిచిన ఆరు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం చేస్తోన్న కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ఆయన వెల్లడించారు. కేవలం ఒక్క రూపాయికే శానిటరీ ప్యాడ్లను అమ్మాయిలకు అందిస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
అమ్మాయిల పెళ్లికి సరైన వయస్సుపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు జరుపుతోందని మోడీ పేర్కొన్నారు. కమిటీ నిర్ణయాన్ని ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని దేశవ్యాప్తంగా ఆడబిడ్డల నుంచి తనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.
కాగా, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సును ప్రధానమంత్రి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత దేశంలో అమ్మాయిల పెళ్లికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండగా, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా ఉంది.