వయో వృద్ధులకు కేంద్రం బంపర్ ఆఫర్
ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు వయసు ధ్రువీకరణ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా కావాలి. ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీని కొనుగోలు చేస్తే చాలు.. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 8.3 వడ్డీని పొందవచ్చు.
వయో వృద్ధులకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్ను మరో మూడేళ్ల పాటు కొనసాగించనున్నారు. దీనికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఎల్ఐసీ ద్వారా కొనసాగించే ఈ పథకం ఇప్పుడు 2023 వరకూ అందుబాటులో ఉండనుంది. 60 ఏండ్లు పైబడి లేదా పదవీ విరమణ అనంతరం ఆదాయం గురించి చింత లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ స్కీమ్ వల్ల కలిగే లాభాలు..
10 ఏండ్ల కాల పరిమితికి వర్తించే ఈ పథకంలో చేరే వృద్ధులు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు వయసు ధ్రువీకరణ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా కావాలి. ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీని కొనుగోలు చేస్తే చాలు.. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 8.3 వడ్డీని పొందవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.1000 నుంచి 5 వేల రూపాయల వరకూ పెన్షన్ అందుతుంది. అలాగే అత్యవసర వైద్య సహాయానికి లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ పాలసీని స్వాధీన పరిచి డబ్బు పొందే వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే పాలిసీదారు జీవిత భాగస్వామి అవసరాలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు.
కాగా ఈ స్కీమ్ కేవలం సీనియర్ సిటిజన్ల కోసమే ఉద్ధేశించింది. ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా ఎల్ఐసీ మాత్రమే నిర్వహిస్తోంది. కాబట్టి ఎల్ఐసీ ద్వారా ఈ పాలసీకి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ పాలసీని మే 4, 2017లో ప్రారంభించారు.