వివాదంలో యువరాజ్ సింగ్.. నోటీసులు జారీ చేసిన గోవా టూరిజం శాఖ..
గోవాలోని తన విల్లాను అద్దెకు ఇస్తానంటూ యువరాజ్ సింగ్ ఆన్ లైన్లో పెట్టడం మీద గోవా టూరిజం శాఖ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆయనకు నోటీసు జారీ చేసింది.
గోవా : యువరాజ్ సింగ్ టీమిండియా స్టార్ మాజీ ఆల్రౌండర్ గా అందరికీ పరిచయమే. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. గోవా పర్యాటక శాఖ యువరాజ్ సింగ్ కు నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్ లోని తన విల్లాను గెస్ట్ ల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు ఆన్లైన్లో పెట్టడంపై మండిపడింది. అధికారుల నుంచి అనుమతి లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని తప్పుపట్టింది. ఈ మేరకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోవాలో హోమ్ స్టే (పేయింగ్ గెస్ట్) ఇవ్వాలంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉత్తర గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో ‘కాసా సింగ్’ పేరిట యువరాజ్ సింగ్ కు ఓ విల్లా ఉంది. ఈ అడ్రస్ కే నవంబర్ 18న టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేష్ కాలే పేరిట నోటీసు జారీ అయ్యింది. ఈ నోటీసుల్లో పేర్కొన్న దాని ప్రకారం.. డిసెంబర్ 8 ఉదయం 11 గంటలకు యువరాజ్ సింగ్ వ్యక్తిగతంగా హాజరై.. అద్దె విషయం వివరణ ఇవ్వాలని అందులో అధికారులు పేర్కొన్నారు. టూరిజం యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి.. జరిమానా లక్షలు వరకు ఎందుకు విధించకూడదో యువరాజ్ సింగ్ వివరణ చెప్పాలని ప్రశ్నించారు. ఇలా గోవాలోని ప్రతి వ్యక్తి హోటల్ లేదా గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని గోవా టూరిజం శాఖ స్పష్టం చేసింది. ఈ వివరాలతో పాటు గతంలో యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్లను కూడా గోవా టూరిజం శాఖ నోటీసులో పేర్కొనడం విశేషం.