గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ ఎన్నికల్లో ఓటమి చెందారు. తండ్రి పోటీ చేసే స్థానం అయిన పనాజీ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్పల్ పారికర్ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి అటానాసియో మోన్సెరట్ విజయం సాధించారు.
గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆయన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి అటానాసియో మోన్సెరట్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. చివరి రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత మోన్సెరాట్ 674 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ తన తండ్రి పోటీ చేసిన పనాజీ నియోజవకర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ స్థానాన్ని ఇవ్వడానికి బీజేపీ మొగ్గుచూపలేదు. ఆ స్థానాన్ని కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే అటానాసియో మోన్సెరాట్ కు కేటాయించింది. దీంతో ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చారు. పనాజీ నుంచి మనోహర్ పారీకర్ 1994, 1999, 2002, 2007, 2012లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ప్రాంతంపై మనోహర్ పారికర్ కు పట్టు ఉండేది. అందుకే అదే స్థానం నుంచి పోటీ చేయాలని ఉత్పల్ పట్టుపట్టారు. కానీ అధిష్టానం దానికి ఒప్పుకోలేదు. దానికి బదులు ఇతర స్థానాన్ని కేటాయిస్తామని చెప్పినా ఆయన అంగీకారం తెలుపలేదు.
1994 నుంచి బీజేపీ పనాజీ స్థానం నుంచి ఓడిపోలేదు. పనాజీ ఉత్తర గోవా జిల్లా, ఉత్తర గోవా లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ మనోహర్ పారికర్ ఫేమ్ ముందు ఆ పార్టీ ఇక్కడ గెలుపొందలేదు. 2019లో మనోహర్ పారికర్ మరణానంతరం జరిగిన ఉపఎన్నికల్లో రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన చిరకాల ప్రత్యర్థి మోన్సెరేట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. తరువాత ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. దీంతో మళ్లీ అక్కడ బీజేపీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నట్లైంది. కానీ ఈ సారి ఉత్పల్ కు సీటు కేటాయిస్తే, మళ్లీ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని బీజేపీ భావించింది. అందుకే సీనియర్ ఎమ్మెల్యే అయిన అటానాసియో మోన్సెరాట్ కే అభ్యర్థిత్వం ఖరారు చేసింది.
ఉత్పల్ పారికర్ పనాజీ నుంచి స్వతంత్రంగా పోటీ చేశారు. శివసేన-ఎన్ సీపీ కూటమి కూడా ఉత్పల్ అభ్యర్థిత్వానికి షరతులతో కూడిన మద్దతు ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాల్మీకి నాయక్ను బరిలోకి దించగా, రివల్యూషనరీ గోన్స్ పార్టీ (RGP) తరఫున రాజేష్ రెడ్కర్ రంగంలోకి దించింది. కానీ చివరికి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.
అయితే ఈ విజయం తనకు సంతృప్తిగా లేదని అటానాసియో మోన్సెరేట్ తెలిపారు. బీజేపీ మద్దతు దారులు తనకు ఓటు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. భవిష్యత్ లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించానని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజలకు సరైన సందేశం ఇవ్వలేదని చెప్పారు. బీజేపీ నేతలందరితో టచ్లో ఉన్నానని, బీజేపీతోనే ఉన్నానని స్పష్టం చేశారు. ఫలితాల విషయంలో సీఎం ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు.
