Go First flight: ప్రస్తుతం భారత విమానాల్లో సాంకేతిక లోపాలు నిరంతరంగా కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. గోఎయిర్ విమానం విండ్షీల్డ్ లో పగుళ్లు రావడంతో విమానాన్ని జైపూర్కు మళ్లించారు.
Go First flight: ఇటీవల భారత దేశ విమానాల్లో సాంకేతిక లోపాలు తరుచుగా కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. గోఎయిర్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. గోఎయిర్కు చెందిన ఢిల్లీ-గౌహతి విమానంలో సాంకేతిక లోపం వెలుగులోకి వచ్చిందని, విమానం యొక్క విండ్షీల్డ్ పగుళ్లు రావడంతో విమానాన్ని జైపూర్కు మళ్లించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు. ఈ విమానం ఏ-320 నియో మోడల్ అని, గత రెండు రోజుల్లో గో ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారి అని అధికారులు చెప్పారు.
తొలుత మంగళవారం తెల్లవారుజామున.. రన్వేపై కుక్క రావడంతో గో ఫస్ట్ విమానం లేహ్ విమానాశ్రయంలో విమానాన్ని రద్దు చేసింది. ఈ విమానం ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే, డీజీసీఏ అధికారులు మాత్రం దీనిని సాధారణ ఘటనగా పేర్కొన్నారు. అదే రోజు గో ఫస్ట్ చెందిన ముంబై-లేహ్ ఫ్లైట్, శ్రీనగర్-ఢిల్లీ ఫ్లైట్స్ ఇంజన్ వైఫల్యానికి గురయ్యాయి. దీంతో ఈ రెండు విమానాలను DGCA నిలిపివేసింది.
గత నెలలో చాలా విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. ఈ ఘటనలపై ప్రస్తుతం డీజీసీఏ విచారణ జరుపుతోందని, ఇంజిన్ ఫెయిల్యూర్తో రెండు విమానాలు రెగ్యులేటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే టేకాఫ్ అవుతాయని అధికారులు తెలిపారు.
గత నెల రోజులుగా భారత కంపెనీల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన ఘటనలు చాలానే ఉన్నాయి. గత మూడు రోజుల్లో.. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భద్రతా తనిఖీలకు సంబంధించి విమానయాన కంపెనీలు, మంత్రిత్వ శాఖ అధికారులు, DGCA అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించారు.
డీజీసీఏ మార్గదర్శకాలు
ఈ తరుణంలో డీజీసీఏ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించగా, టేకాఫ్కి ముందు వివిధ కంపెనీల విమానాలను ధృవీకరించడానికి ఇంజనీర్ల సంఖ్య సరిపోదని గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది. టేకాఫ్ అయ్యే ముందు.. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ (AME) ప్రతి విమానాన్ని పరిశీలించి, ధృవీకరిస్తారు. శిక్షణ పొందిన ఏఎంఈల నియామకానికి సంబంధించి అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ మార్గదర్శకాలను జారీ చేసిందని, జూలై 28లోగా వాటిని అమలు చేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. DGCA ప్రకారం.. అక్కడికక్కడే జరిపిన దర్యాప్తులో విమానయాన సంస్థల AME బృందాలు లోపాలకు గల కారణాలను తప్పుగా గుర్తించినట్లు కనుగొన్నారు.