కేరళ వరదలు...హెల్ప్ చేయమని ఏడ్చేసిన ఎమ్మెల్యే
హెలికాప్టర్లు పంపకపోతే బాధితులను కాపాడుకోవడం కష్టమంటూ చెంగన్నూర్ ఎమ్మెల్యే సాజీ చెరియన్ ఓ టీవీ చానెల్ లైవ్లో కన్నీరు పెట్టుకున్నారు.
కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బాధితులను తరలించేందుకు కేరళ నేతలు నానా తంటాలు పడుతున్నారు. తమ ప్రాంతంలో అనేకమంది వరదల్లో చిక్కుకున్నారనీ.. హెలికాప్టర్లు పంపకపోతే బాధితులను కాపాడుకోవడం కష్టమంటూ చెంగన్నూర్ ఎమ్మెల్యే సాజీ చెరియన్ ఓ టీవీ చానెల్ లైవ్లో కన్నీరు పెట్టుకున్నారు. తమ పరిస్థిని అర్థం చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే హెలికాప్టర్లు పంపాలని వేడుకున్నారు.
‘‘దయచేసి మాకు హెలికాప్టర్లు పంపండి. వాయుమార్గం ద్వారా తప్ప బాధితులను తరలించేందుకు వేరే మార్గం లేదు. హెలికాప్టర్లు పంపకపోతే 50 వేలమంది ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉంది. ఫిషింగ్ బోట్లతో సహా మేము చేయగలిగినంత వరకు చేస్తున్నాం. ఇంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం.
సైనిక దళాలు ఇక్కడికి వచ్చి మాకు సాయం చేయండి.. ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్...’’ అంటూ ఆయన వేడుకున్నారు. తమ నియోజక వర్గంలో ఇప్పటికే 50 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కంటతడి పెట్టిన విషయం తెలుసుకుని సైనిక బలగాలు హుటాహుటిన స్పందించి ఇప్పటికే 10 బోట్లు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఎన్డీఆర్ఎఫ్కి చెందిన 79 బోట్లతో పాటు 400 పైగా మత్స్యకారుల బోట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.