అవినీతిలో నిండిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ని ప్రక్షాళన చేసేందుకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ ఓటర్లను కోరారు. డిసెంబర్‌ 4న  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఇవాళ వ్యాపారులతో సమావేశమయ్యారు. 

అవినీతితో నిండిన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)ని ప్రక్షాళన చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వ్యాపారుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని తాము నడిపిస్తుంటే.., ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ బీజేపీ చేతిలో ఉన్నదని, ఈ రెండు ఒకే పార్టీ అధికారంలో లేవని, అలా ఎప్పుడూ జరగలేదని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి ఆ సంప్రదాయాన్ని తిరగరాయాలని, మున్సిపల్ కార్పొరేషన్‌లో తమను గెలిపించాలని ఆయన ఓటర్లను అన్నారు. ఇలా జరిగితేనే.. ప్రగతి సాధించగలమని, ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను ఇద్దరినీ పిలిచి పనులు ఎందుకు చేయలేదనే అవకాశముందని అన్నారు. ఎంసీడీ లో అవినీతి జరుగుతోందనీ, కానీ.. ఆ అవినీతిని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోపించారు.

తమ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని, ఎంసీడీలో అధికారంలోకి వస్తే మూడు నాలుగు నెలల్లో అవినీతిని అంతం చేస్తామని అన్నారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులు ముఖ్యమంత్రిని కలిసి తమ వేదనను పంచుకున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. డిసెంబరు 4 ఆదివారం నాడు ఎంసీడీ (మున్సిపల్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ) ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7న ఫలితాలు రానున్నాయి.