దారుణం.. ప్రియురాలిని కత్తులతో పొడిచి, బండరాయితో మోది హత్య.. సీసీటీవీలో హత్యోదంతం..
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 16 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు అతి దారుణంగా కత్తులతో పొడిచి, రాయితో మోది హత్య చేశాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
న్యూఢిల్లీ : ఓ టీనేజ్ అమ్మాయి మీద ఓ యువకుడు తీవ్ర దాడికి దిగాడు. ఆ దాడిలో ఆ అమ్మాయి అచేతనంగా మారిపోయింది. అయినా కూడా అతను దాడిని ఆపలేదు. అనేకసార్లు కత్తితో పొడిచాడు. ఆ తరువాత రాయితో మొదాడు. ఆ సమయంలో ఆ దారిగుండా వెడుతున్నవారు చూసినా కూడా పట్టించుకోలేదు. కనీసం ఆపే ప్రయత్నం చేయలేదు. అక్కడున్న సీసీ కెమెరాలో ఇదంతా నమోదయ్యింది.
ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఈ ఘటన వెలుగు చూసింది. సీసీ కెమెరాలో ఈ అత్యంత ఆందోళనకరమైన ఫుటేజ్ రికార్డయ్యింది. ఆ వీడియోలో.. ఒక యువకుడు ఒక అమ్మాయిని చాలాసార్లు కత్తితో పొడిచాడు. రాతితో కొట్టాడు, అటునుంచి వెడుతున్నవాళ్లు.. అది చూస్తూ..అక్కడినుంచి దాటి వెళ్లిపోయారు కానీ.. దాడిని ఆపడానికి ఏమీ చేయలేదు.
16 ఏళ్ల బాలిక అచేతనంగా మారిపోయినా కానీ ఉన్మాద దాడి ఆగలేదు. అదేదో నిర్మానుష్య ప్రదేశం కూడా కాదు. చాలా రద్దీగా ఉన్న ఏరియా.. అలాంటి లేన్లో ఆమె ప్రియుడుగా అనుమానిస్తున్న యువకుడి చేతిలో ఆ అమ్మాయి హత్య చేయబడింది. కానీ ఎవరూ ఆమెను రక్షించలేకపోయారు. హత్య చేసిన తరువాత అతడు పరారయ్యాడు.
క్రితం రోజు సాయంత్రం వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం యువతిపై ఆ వ్యక్తి కత్తితో దాడి చేసి పదే పదే పొడిచాడు. ఒకానొక సమయంలో, కత్తి ఆమె శరీరంలో ఇరుక్కుపోయినట్లు కనిపించింది. హంతకుడు ఆమె శరీరాన్ని కదిపి కత్తిని బైటికి లాగాడు. ఆ తర్వాత ఒక రాతితో తీసుకుని ఆమెను పదే పదే కొట్టాడు.
ఒక సమయంలో అతను ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లు కనిపించాడు, కాని తిరిగి బండరాయితో వచ్చి ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. బాలిక తన స్నేహితుడి కుమారుడి బర్త్డే పార్టీకి వెళుతుండగా దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.
"వారు రిలేషన్ లో ఉన్నారు, శనివారం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆదివారం టీనేజర్ తన స్నేహితుడి కుమారుడి పుట్టినరోజుకు వెళ్లాలని ప్లాన్ చేసింది. ఆ వ్యక్తి ఆమెను అనుసరించి, అనేకసార్లు కత్తితో పొడిచి, రాయితో కొట్టాడు" అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహం, రక్తం మడుగులో పడి ఉండడం గమనించారు. హంతకుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.ఒక టీమ్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమన్ నల్వా తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ హెడ్ స్వాతి మలివాల్ తెలిపారు. "నేరం సీసీటీవీలో నమోదయింది. చాలా మంది దీనిని చూశారు, కానీ పట్టించుకోలేదు. ఢిల్లీ మహిళలు, బాలికలకు అత్యంత ప్రమాదకరంగా మారింది" అని ఆమె అన్నారు.