కాసేపట్లో పెళ్లనగా వధువు జంప్.. 13 రోజులపాటు పెళ్లిబట్టల్లో.. మండపంలోనే ఎదురుచూసిన వరుడు.. చివరికి...
కాసేపట్లో పెళ్లనగా ఓ వధువు మండపంనుంచి పారిపోయింది. అయితే, వరుడు మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటానంటూ 13 రోజులపాటు పెళ్లి దుస్తుల్లో.. మండపంలోనే ఎదురు చూశా
రాజస్థాన్ : ఇటీవలి కాలంలో పెళ్లి పీటల మీద నుంచి వధువో.. వరుడో పారిపోతున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అలాంటి ఓ ఘటనే రాజస్థాన్లో వెలుగు చూసింది. అది కూడా.. వధువు కోసం.. వరుడు 13 రోజులపాటు పెళ్లి దుస్తులలోనే ఎదురు చూశాడు. మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక్కడు సినిమాలోని సీన్ లాంటిదే ఇది.
తనను వదిలి పారిపోయిన భూమికను వెతుక్కుంటూ వెళ్లిన ప్రకాష్ రాజ్.. బురదలో పడిపోగా.. భూమిక ఆచూకీ దొరికే వరకు తను స్నానం చేయను అంటూ అలాగే కూర్చుంటాడు. అలాగే ఈ వరుడు కూడా.. తనతో పెళ్లి వద్దంటూ వెళ్లిపోయిన వధువు తిరిగి వచ్చేవరకు..బట్టలు మార్చుకోకుండా అలాగే కూర్చున్నాడు.
కాకపోతే.. అక్కడ రివెంజ్ అయితే ఇక్కడ ప్రేమ. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడ సౌనా గ్రామానికి చెందిన సకారం అనే వ్యక్తి కూతురైన మనీషాకు వారి బంధువైన శ్రవణ్ కుమార్ తో వివాహం నిశ్చయించారు. మే 4తేదీన పెళ్లి నిశ్చయించారు.
దీంట్లో భాగంగా వరుని తరపు వారంతా వధువు ఉంటున్న గ్రామానికి వచ్చారు. పెళ్లికూతురు తరపు వారు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మే 4వ తేదీ ఉదయం వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి తంతు మొదలయ్యింది.. పెళ్లి కుమార్తెను తీసుకురావాలంటూ పురోహితుడు తెలిపాడు. కాగా.. ఆమె రావడానికి కాస్త సమయం పడుతుందంటూ పెళ్లి కుమార్తె తరపు వారు అతనికి తెలిపారు.
అయితే, మనీషా తనకు విపరీతమైన కడుపునొప్పి వస్తుందని చెప్పి ఆ సమయానికి ఇంటి వెనుకకు వెళ్ళింది. అక్కడ తనకోసం అప్పటికే వేచి ఉన్న బంధువుతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కడుపునొప్పి అంటూ వెళ్లిన కూతురు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులంతా వెతికారు. కానీ, ఆమె కనిపించలేదు దీంతో అందరూ కంగారు పడ్డారు.
దీని మీద పెళ్లి కుమార్తె తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె పెళ్లికి రెడీ అవ్వడానికి గదిలోకి వెళ్లిందని ఆ తర్వాత కడుపునొప్పి వస్తుందంటూ టాయిలెట్ కి వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన కూతురు.. మేనమామ కొడుకు అయిన భరత్ కుమార్ తో బయటకు వెళ్లిపోయిందని చెప్పాడు. ఎలాగో ఆమె ఆచూకీ కనిపెట్టిన బంధువులు ఆమెకు ఎంత చెప్పినా ఈ పెళ్లికి ఆమె ససేమిరా అంది. తర్వాత ఇంటికి తిరిగి వచ్చినా కూడా పెళ్లి చేసుకోనని మొండికేసి కూర్చుంది.
ఇక మరోవైపు.. ఆమెనే చేసుకుంటానని పట్టుబట్టిన వరుడు పెళ్లి అలంకరణలోనే పెళ్లి మండపంలో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఇలా ఒక గంట.. రెండు గంటలు… ఒకరోజు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 13 రోజుల వరకు.. పెళ్లి బట్టలతోపాటు పెట్టుకున్న పగిడి కూడా తీయకుండా ఎదురు చూశాడు. పెళ్లి మండపాన్ని.. అదే అలంకరణలతో అలాగే ఉంచారు.
ఎట్టకేలకి 13 రోజుల తర్వాత…పెళ్లి కుమార్తె తన మొండిపట్టు వీడి కళ్యాణ మండపానికి చేరుకుంది. అలా 16వ తేదీన వీరి వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ట్విస్టేంటంటే ఆమె ఎందుకు పెళ్లి వద్దందో తెలియకపోవడం.