ఛఠ్ పూజ వేళ సిలిండర్లు పేలి ఎగిసిపడ్డ మంటలు, 30 మందికి గాయాలు...
బీహార్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. సంతోషంగా ఛఠ్ పూజ చేసుకుంటుంటే సిలిండర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 30 మందికి గాయాలయ్యాయి.
బీహార్ : బీహార్ లోని ఔరంగాబాద్ లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వంట చేస్తోన్న సమయంలో సిలిండర్లు పేలి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఛఠ్ పూజకు సిద్ధమవుతోన్న వేళ ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
నగరంలోని శాహ్ గంజ్ ప్రాంతంలో ఛఠ్ పూజ నిమిత్తం ఓ కుటుంబం శనివారం అర్థరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో వంట సిద్ధం చేస్తోంది. సూర్యోదయం లోపులో ప్రసాదం తయారుచేసే పనిలో నిమగ్నమయ్యింది. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగా సిలిండర్లకు మంటలు అంటుకుని.. భారీగా వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు చేసే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దాంతో ఈ ఘటనలో 30 మంది గాయాలపాలయ్యారు.
25మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఔరంగాబాద్ లోని సదర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.