ఇసుక అక్రమ రవాణా పై గొడవ.. రెండు ముఠాల మధ్య కాల్పులు.. నలుగురు దుర్మరణం.. ఎక్కడంటే?
బిహార్లో ఇసుక అక్రమ రవాణా కోసం రెండు ముఠాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాల్పులు జరుపుకునే వరకు వెళ్లింది. ఈ కాల్పుల్లో నలుగురు స్పాట్లోనే మరణించారు.
న్యూఢిల్లీ: బయటపడ్డ నేరాలకు మించి మరెన్నో చీకట్లోనే ఉండిపోతాయి. ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. పరిఢవిల్లుతుంటాయి. అందులో ఏ కొసనే బయటకు కనిపిస్తే.. పెద్ద సంచలనంగా మారిపోతుంది. కానీ, కొన్ని సార్లు బయటపడ్డ చిన్న చిన్న ఘటనలు నేర తీవ్రతను, లేదా వ్యవస్థీకృతమైన నేరాలను వెల్లడి చేస్తుంది. బిహార్లో జరిగిన ఓ చిన్న ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.
ఇటీవలి కాలంలో ఇసుక అక్రమ రవాణా పై చాలా కథనాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి నేరాలు సర్వసాధారణమైపోయాయి. బిహార్లో వెలుగులోకి వచ్చిన ఓ చిన్న ఘటన కలకలం రేపుతున్నది. ఇసుక అక్రమ రవాణాపై రెండు ముఠాల మధ్య వాగ్వాదం జరిగింది. చిన్నపాటి ఘర్షణ జరిగింది. అది తీవ్రరూపం దాల్చింది. ఏకంగా కాల్పుల వరకూ దారి తీసింది. ఇలా కాల్పులు జరిగిన ఘటనలో నలుగురు మరణించారు.
బిహార్లోని సోన్ నది నుంచి అక్రమంగా ఇసుకను తరలించడంపై రెండు ముఠాల మధ్య గొడవ జరిగింది. అనంతరం జరిగిన కాల్పుల్లో నలుగురు స్పాట్లోనే మరణించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు స్పాట్కు చేరుకున్నారు. కేసును టేకప్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బిహార్లోని బిహతా టౌన్లో చోటుచేసుకుంది.