బామ్మా అంటూనే... తొంబై ఏళ్ల వృద్దురాలిపై సామూహిక అత్యాచారం
సభ్యసమాజం తలదించుకునే దారుణ సంఘటన ఒకటి త్రిపుర రాజధాని అగర్తలలో చోటుచేసుకుంది.
అగర్తల: సభ్యసమాజం తలదించుకునే దారుణ సంఘటన త్రిపురలో చోటుచేసుకుంది. తొంబై ఏళ్ల వృద్దురాలిపై బామ్మా అంటూ పిలిచే ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. వయసు మీదపడిన సమయంలో ఇలా లైంగికదాడికి గురవడంతో వృద్దురాలు తీవ్ర అస్వస్థతకు గురయి ఆస్పత్రిపాలయ్యింది.
ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. త్రిపుర రాజధాని అగర్తలలో గతనెల 24వ తేదీన ఈ దారుణం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్దురాలి వద్దకు వెళ్లిన ఇద్దరు యువకులు ఆమె వయసుకు కూడా గౌరవమివ్వకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇద్దరు యువకులు లైంగికంగా దాడి చేయడంతో సదరు వృద్దురాలు అస్వస్థతకు గురయ్యింది.
అయితే ఈ విషయాన్ని వృద్దురాలు బయటపెట్టకపోయినా కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి కాస్త కోలుకున్నాక ఆమెను అడిగారు. దీంతో తనపై జరిగిన అఘాయిత్యం గురించి వృద్దురాలు వారికి తెలిపింది. దీంతో అక్టోబర్ 29వ తేదీని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పరారీలో వున్న నిందితులిద్దరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.