స్వాతంత్య్ర సమరయోధుడు రఘువీర్ చరణ్ శర్మ కన్నుమూత..
మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు రఘువీర్ చరణ్ శర్మ అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన మరణం పట్ల సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాల ప్రకారం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించనుంది.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు రఘువీర్ చరణ్ శర్మ (99) కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మరణించారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు.
రఘువీర్ చరణ్ శర్మ కు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు, అయితే ఆయన ఒంటరిగానే జీవించేవారని ఓ సామాజిక కార్యకర్త తెలిపినట్టు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనంలో పేర్కొంది. శర్మ తనకు లభించే గౌరవ వేతనాన్ని పొదుపు చేసి రూ. 25 లక్షలను నగరంలో గొప్ప నాయకుల విగ్రహాలను ప్రతిష్టించడానికి విరాళంగా ఇచ్చారు.
రఘువీర్ చరణ్ శర్మ విదిషలో షహీద్ జ్యోతి స్తంభం, హిందీ భవన్ను స్థాపించారు. ఆయన అంత్యక్రియలు శనివారం నిర్వహిస్తామని స్థానిక కలెక్టర్ ఉమా శంకర్ భార్గవ తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం అంత్యక్రియలు చేపడుతామని చెప్పారు.
కడుపు నొప్పి అని వెడితే కిడ్నీ గాయబ్...ఉత్తరప్రదేశ్ లో డాక్టర్ ఘాతుకం...
కాగా.. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శర్మ సంతాపం తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం, సామాజిక రంగానికి ఆయన చేసిన అమూల్యమైన కృషిని గుర్తు చేసుకున్నారు.