ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. ఇద్దరు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మహారాష్ట్రలోని ముంబాయిలో ఘోరం జరిగింది. ఓ నాలుగు అంతస్థుల భవనం సోమవారం అర్ధరాత్రి కూలిపోయింది. దీంతో ఆ భవనంలో నివసిస్తున్న ప్రజలు శిథిలాల కింది ఉండిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతోంది.
మహారాష్ట్రలోని ముంబాయిలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో ఆ భవనంలో ఉన్న అనేక మంది అందులో చిక్కుకుపోయారు. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. చనిపోయిన వారి వయస్సు 28 నుంచి 30 మధ్య ఉంటుదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 12 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. వారికి గాయాలు అయ్యాయి. ఇంకా ఆ శిథిలాల కింద 20-22 మంది చిక్కుకున్నట్టు సమాచారం. వారిని కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటన కుర్లా ప్రాంతంలో చోటు చేసుకుంది. అక్కడ నాయక్ నగర్ సొసైటీలో ఉన్న రెసిడెన్షియల్ భవనంలోని ఒక భాగం మొత్తం కుప్పకూలిందని, మరో భాగం కూడా కూలిపోయే అవకాశం ఉందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు.
మతసామర్యం దెబ్బతీసేలా పోస్టులు: ఆల్ట్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు జుబేర్ అరెస్ట్
బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ఇప్పటి వరకు 12 మందిని రక్షించగా.. వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఆపరేషన్ కొనసాగుతోంది కాబట్టి పూర్తి స్థాయిలో అందులో చిక్కుకుపోయిన వారి సంఖ్య, మృతుల సంఖ్య నిర్ధారించలేమని బీఎంసీ పేర్కొంది. కాగా కుర్లాలో భవనం కూలిన ప్రదేశాన్ని ఆదిత్య ఠాక్రే సందర్శించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలకు BMC నోటీసులు అందజేసి ఖాళీ చేయించాలని అన్నారు.
జాలరి పంట పండింది.. 55 కిలోల చేప పడింది.. వేలంలో రూ. 13 లక్షలకు విక్రయం
‘‘ BMC నోటీసులు జారీ చేసినప్పుడల్లా (భవనాలు) తమను తాము ఖాళీ చేయాలి. లేకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం ’’ అని వార్తా సంస్థ ANIతో ఆదిత్య ఠాక్రే చెప్పారు. “ ఈ ప్రమాదం నుంచి పలువురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. మొత్తం 4 భవనాలకు బీఎంసీ నోటీసులు అందజేసింది. ఖాళీ చేయాలని సూచించింది. కానీ ప్రజలు అక్కడే నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ రక్షించడమే మా ప్రాధాన్యత. ఉదయం మేము ఈ భవనాల తరలింపు, కూల్చివేతలను పరిశీలిస్తాం. వీటి వల్ల సమీపంలోని ప్రజలు ఇబ్బంది పడకూడదు.’’ అని తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఘట్కోపర్, సియోన్లోని సివిక్ ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. మరింత మంది ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి సమాచారం రావడంతో దాదాపు 12 ఫైర్ ఇంజన్లు, రెండు రెస్క్యూ వ్యాన్ లు, సిబ్బంది మోహరించామని తెలిపారు. కాగా ప్రస్తుతం కూలిపోయిన భవానికి బీఎంసీ 2013 సంవత్సరం నుంచి పదే పదే నోటీసులు జారీ చేసిందని మున్సిపల్ అదనపు కమిషనర్ అశ్విని భిడే PTIకి తెలిపారు. అయినప్పటికీ దానిని ఎవరూ ఖాళీ చేయలేదని అన్నారు.