అకాల వర్షాలు.. తెలంగాణ సరిహద్దుల్లో పిడుగు పడి నలుగురి మృతి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చిరోలిలో జిల్లాలో పిడుగులు పడి నలుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వర్షం పడుతోందని ఈ కుటుంబం మొత్తం చెట్టు కిందికి వెళ్లింది. ఈ సమయంలో చెట్టుపై పిడుగుపడింది.
![Four killed by lightning in Maharashtra's Gadchiroli bordering Telangana..ISR Four killed by lightning in Maharashtra's Gadchiroli bordering Telangana..ISR](https://static-ai.asianetnews.com/images/01gke6csggejzsggzsr2qd4swg/new-project---2022-12-04t143757-771_363x203xt.jpg)
దేశంలోని అనేక చోట్ల సోమవారం అకాల వర్షాలు కురిశాయి. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు దంచికొట్టాయి. పలు చోట్ల ఈ గాలి వానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వర్షాలకు పంటలు నాశనం అయ్యాయి. కాగా.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో నలుగురు చనిపోయారు.
వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం అకాల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీశాయి. ఇదే సమయంలో వడ్సా మండలం అమ్ వావ్ కు గ్రామానికి చెందిన భరత్ రాజ్ గడె తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నాడు. ఆయన సోమవారం ఉదయం కురకేడ మండలంలో ఉదయం పూట జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరై.. తిరిగి అమ్ వాడకు బయలుదేరాడు. ఈ క్రమంలో ఒక్క సారిగా వర్షం మొదలైంది.
భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుండటంతో బైక్ ముందుకు కదలడం కష్టంగా మారింది. దీంతో తన భార్య, పిల్లలతో కలిసి ఆయన ఓ చెట్టు కిందకు వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ఆ చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఆ నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే మరణించారు. ఈ ఘటనతో అమ్ వావ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు.