కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన కాంగ్రెస్ హయంలో మంత్రిగా పని చేశారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆయనకు సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సుఖ్ రామ్ మొత్తంగా ఐదుసార్లు విధానసభ ఎన్నికల్లోనూ, మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిట్ సుఖ్ రామ్ (94) మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వైద్యం కోసం చేరారు. ఆయన మృతి చెందిన విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ ప్రకటించారు.
ఆశ్రయ్ కుమార్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. ‘‘ అదేయు తాత ఫోన్ ఇక నుంచి మోగదు (అల్విదా దాదాజీ; అభి నహీ బజేగీ ఫోన్ కీ ఘంటి)’’ అని పేర్కొన్నారు. దీంతో పాటు తాతతో కలిసి కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఆయన ఎప్పుడు చనిపోయారనే విషయాలన్ని ఆ పోస్ట్ లో స్పష్టంగా తెలుపలేదు. సుఖ్ రామ్కు మే 4వ తేదీన మనాలిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో అతడిని మండిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మే 7వ తేదీన ఢిల్లీకి తరలించారు. అయితే ఢిల్లీ ప్రయాణించడానికి అవసరమైన హెలికాప్టర్ ను హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ అందించారు.
రాజకీయ జీవితం
సుఖ్ రామ్ 1993 నుండి 1996 వరకు కేంద్ర సహాయ, కమ్యూనికేషన్స్ (స్వతంత్ర) మంత్రిగా ఉన్నారు. ఆయన హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా పని చేశారు. మొత్తంగా ఐదుసార్లు విధానసభ ఎన్నికల్లోనూ, మూడుసార్లు లోక్సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఆయన 1963 నుండి 1984 వరకు మండి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. హిమాచల్ ప్రదేశ్లో పశుసంవర్ధక మంత్రిగా ఉన్న సమయంలో జర్మనీ నుండి ఆవులను తీసుకువచ్చారు. ఇది రాష్ట్ర రైతుల ఆదాయాన్ని పెంచడానికి దారితీసింది.
1984లో లోక్సభకు ఎన్నికై రాజీవ్గాంధీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో సుఖ్ రామ్ రక్షణ ఉత్పత్తి, సరఫరాలు, ప్రణాళిక, ఆహారం, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సుఖ్ రామ్ 1993 నుండి 1996 వరకు కమ్యూనికేషన్ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత)గా ఉన్నారు. సుఖ్ రామ్ మండి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనే ఆయన కుమారుడు అనిల్ శర్మ 1993లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. సుఖ్ రామ్ 1996లో మండి లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. అయితే టెలికాం స్కామ్ తర్వాత ఆయన, ఆయన కుమారుడు కాంగ్రెస్ నుంచి బహిష్కారానికి గురయ్యారు. అయితే ఆ స్కామ్ కు సంబంధించి 2011లో సంవత్సరంలో ఐదేళ్ల జైలుశిక్ష పడింది.
సొంత పార్టీ ఏర్పాటు..
కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కారానికి గురైన తరువాత ఆయన హిమాచల్ వికాస్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఇది బీజేపీతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో చేరింది. 1998లో సుఖ్ రామ్ మండి సదర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన కుమారుడు అనిల్ శర్మ 1998లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
2003 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన మండి అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు కానీ 2004 లోక్సభ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్లో చేరాడు. ఆయన కుమారుడు అనిల్ శర్మ 2007, 2012లో కాంగ్రెస్ అభ్యర్థిగా మండి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుఖ్ రామ్ ఆయన కుమారుడు అనిల్ శర్మ, మనవడు ఆశ్రయ్ శర్మతో కలిసి బీజేపీలో చేరారు. ప్రస్తుతం సుఖ్ రామ్ కుమారుడు అనిల్ శర్మ మండి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే సుఖ్ రామ్ తన మనవడు ఆశ్రయ్ శర్మతో కలిసి 2019 లోక్సభ ఎన్నికలకు ముందు టికెట్ కోసం తిరిగి కాంగ్రెస్లో చేరాడు, కానీ ఆయన గెలవలేకపోయాడు. కాగా సుఖ్ రామ్ 1927 సంవత్సరం జూలై 27వ తేదీన జన్మించాడు. ఆయన మరో మనవడు ఆయుష్ శర్మ ఒక నటుడు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరిని వివాహం చేసుకున్నాడు.
