హత్యాప్రయత్నం కేసులో.. మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ అరెస్ట్
ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి వీరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పవన్ తోపాటు లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు
మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తిపై జరిగిన హత్యాప్రయత్నం కేసులో మాజీ ఛాంపియన్ ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...
ఢిల్లీకి చెందిన పవన్ అనే వ్యక్తి.. తన సహచరులు సోంపాల్, లక్ష్మణ్ లతో ఉన్న సమయంలో.. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి వీరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పవన్ తోపాటు లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. పోలీసుల దర్యాప్తులో పవన్ అనే వ్యక్తి మూడు హత్య కేసుల్లో నిందితుడిగా గుర్తించారు.
కాగా.. అతనిని చంపాలని చూసింది ఎవరా అని ఆరా తీయగా.. జాతీయ మాజీ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్ కునాల్ గా తేలింది. కునాల్ అతని స్నేహితుడు నవీన్ తో కలిసి పవన్ పై దాడి చేసినట్లు తేలింది. పాత కక్ష్య నేపథ్యంలో కునాల్ ఈ దాడికి పాల్పడటం సమాచారం.
1990లో పవన్ తో కునాల్ వాళ్ల అంకుల్ కి మధ్య ఏదో విషయంలో గొడవలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు పవన్... కునాల్ వాళ్ల అంకుల్ ని దారుణంగా హత్య చేశాడు. దీంతో.. తమ అంకుల్ చావుకు కారణమైన పవన్ ని చంపాలని కునాల్ భావించాడు. అందుకే వారిపై దాడికి పాల్పడటం గమనార్హం. కాగా.. కునాల్ 2017లో రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ సాధించాడు.