సంచలన నిర్ణయం తీసుకున్న జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఆరోగ్య సమస్య వల్ల అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 5న పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన వెలువడినున్నది.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తన్వీర్ సాదిక్ ధృవీకరించారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
శ్రీనగర్లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగోలేదని పార్టీని నడిపించే అవకాశం లేదని అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.పార్టీని తమ పరిధిలోని ప్రతి ఇంటికి చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలనీ, పరిపాలన, సామాన్య ప్రజానీకానికి మధ్య వారధిగా పనిచేయాలన్నారు. అలాగే.. హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలని, అలాగే.. ప్రజా సంక్షేమంపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు.
అదే సమయంలో ఫరూక్ అబ్దుల్లా రాజీనామాతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబరు 5న పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగవచ్చని సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు జరగనంత వరకు ఫరూక్ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఇప్పుడు ఫరూక్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు పార్టీ అధిష్ఠాన బాధ్యతలు అందుకోబోతున్నారని ఊహాగాహానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉమర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి తన్వీర్ సాదిక్ తెలిపారు.
ఫరూక్ అబ్దుల్లా చివరిసారిగా నవంబర్ 13న బహిరంగంగా కనిపించారు. ఎస్పీ పోషకుడు ములాయం సింగ్ యాదవ్ మృతికి నివాళులర్పించేందుకు ఆయన లక్నో వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ను కలిసి ఆయనను ఓదార్చారు. అదే సమయంలో 2024లో ప్రతిపక్షాల నుంచి ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థిపై శ్రద్ద వహించాలని అన్నారు. అన్ని పార్టీలు కలిసి ఓ సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించారు.
ఫరూఖ్ అబ్దుల్లా ప్రస్తానం..
ఫరూఖ్ అబ్దుల్లా.. తొలిసారి 1980లో శ్రీనగర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఒక ఏడాదిలోనే జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) పార్టీ కీలక నాయకుడుగా ఎదిగాడు. 1981 ఆగస్టులో జేకేఎన్ సీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన తండ్రి షేఖ్ అబ్దుల్లా ఆ పదవిలో కొనసాగారు. అయితే.. ఆయన మృతితో ఫరూఖ్ అబ్దుల్లా పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు. మొత్తం నాలుగుసార్లు కశ్మీర్ సీఎంగా ఆయన పనిచేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2009 నుంచి 2014 వరకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఫరూఖ్ అబ్దుల్లా.