బెంగాల్ మాజీ సీఎం దంపతులకు కోవిడ్: హోం ఐసోలేషన్లో బుద్దదేబ్
పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్దదేబ్ భట్టాచార్య దంపతులకు కరోనా సోకింది. బుద్దదేబ్ భట్టాచార్య ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటున్నారు.
కోల్కత్తా:పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్దదేబ్ భట్టాచార్య దంపతులకు కరోనా సోకింది. బుద్దదేబ్ భట్టాచార్య ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. బుద్దదేబ్ భట్టాచార్య సతీమణి మీరా భట్టాచార్యకు కూడ కరోనా సోకింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. సిటీ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకొంటున్నారు. వీరిద్దరితో పాటు వీరి సహాయకుడికి కూడ కరోనా సోకినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.
మాజీ సీఎం బుద్దదేబ్ భట్టాచార్య దంపతుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. బెంగాల్ రాష్ట్రానికి 11 ఏళ్లపాటు బుద్దదేబ్ భట్టాచార్య సీఎంగా పనిచేశారు. జ్యోతిబసు నుండి సీఎం బాధ్యతలు తీసుకొన్న బుద్దదేబ్ భట్టాచార్య 11 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నారు. నందిగ్రామ్, సింగూరులలో పరిశ్రమలకు భూ కేటాయింపులు చేయడంపై అప్పట్లో టీఎంసీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. నందిగ్రామ్, సింగూర్ భూపోరాటాలు బెంగాల్ రాష్ట్రంలో లెఫ్ట్ఫ్రంట్ పాలనకు చరమగీతం పడడానికి కారణమయ్యాయి.
బెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదౌతున్నాయి. ఈ కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేసింది. రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కారణంగా నిర్వహించిిన ర్యాలీలు, ప్రచార సభలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని వైద్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.