కర్ణాటక మంత్రి ఆర్ అశోక్ (r ashok) ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌లో చెల‌రేగుతోన్న హిజాబ్ వివాదం వెనుక ఐఎస్ఐఎస్‌తో పాటు ప‌లు అంతర్జాతీయ సంస్థల కుట్ర‌ ఉందని ఆయన ఆరోపించారు. ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదని అశోక్ అన్నారు. 

క‌ర్ణాట‌క‌లో (karnataka) రాజుకున్న హిజాబ్ వివాదం (hijab row) దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. విద్యా సంస్థ‌ల్లో యూనిఫాం ఉండ‌గా, హిజాబ్ ధ‌రించ‌డం ఏంట‌ని కొందరు.. హిజాబ్ ధ‌రించ‌డం ముస్లిం బాలికల హ‌క్కు అంటూ మ‌రికొంద‌రు వాదిస్తూ రెండు వర్గాలుగా చీలిపోయారు. దీనిపై స్పందించిన కర్ణాటక మంత్రి ఆర్ అశోక్ (r ashok) ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌లో చెల‌రేగుతోన్న ఈ వివాదం వెనుక ఐఎస్ఐఎస్‌తో పాటు ప‌లు అంతర్జాతీయ సంస్థల కుట్ర‌ ఉందని ఆయన ఆరోపించారు. ముస్లిం బాలికలు, మహిళలను నిందించాల్సిన అవసరం లేదని అశోక్ అన్నారు. ఈ వివాదం వెనక చాలా మంది ఉన్నారని, ఉడుపిలో ప్రారంభమైన నిరసనలు అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్తాయని ఆయ‌న ప్రశ్నించారు.

వేగంగా ఈ నిరసనలు వ్యాపించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారంటూ అశోక్ నిల‌దీశారు. కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ సంస్థ కూడా ఈ వివాదం వెనుక ఉంద‌ని ఆయన ఆరోపించారు. చిన్నారులు ఇలాంటి మతపరమైన వివాదాల్లో భాగం కాకూడ‌ద‌ని అశోక్ హితవు పలికారు. పిల్ల‌లు ఇళ్లలో ఏమైనా చేసుకోవచ్చని, అయితే, విద్యా సంస్థ‌ల్లో మాత్రం విద్య‌పైనే దృష్టి పెట్టాలని సూచించారు. హిజాబ్‌పై చెల‌రేగుతోన్న‌ వివాదంలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి తాము ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఈ అంశంపై తాము దశల వారీగా తగిన చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి హెచ్చ‌రించారు. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని ఆయ‌న అభిప్రాయపడ్డారు. ముఖ్య‌మంత్రితో ఈ అంశంపై తాను మాట్లాడతాన‌ని అశోక్ పేర్కొన్నారు. 

కాగా, విద్యా సంస్థల్లో ఇప్ప‌టికీ కొంద‌రు విద్యార్థులు హిజాబ్ ధరిస్తున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయన్నారు. దీంతో ప‌లు విద్యా సంస్థ‌ల వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొంటున్నాయి. హిజాబ్ ధ‌రించి వ‌చ్చే బాలిక‌ల‌ను గేటు వ‌ద్దే విద్యా సంస్థ‌ల సిబ్బంది అడ్డుకుంటోన్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. శనివారం హిజాబ్ ఆందోళనలో పాల్గొన్న 58మంది విద్యార్థులను shivamoggaలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు మొదటి నుంచి హిజాబ్ కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్ తమ హక్కు అంటూ నినదిస్తున్నారు. 

అయితే తాము కేసును తేల్చే దాకా మతపరమైన వస్త్రాలు ధరించి స్కూళ్లకు వెళ్లొద్దని కర్ణాటక హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది విద్యార్థులు హిజాబ్ ధరించి స్కూళ్లకు వస్తున్నారు. దీని మీద సీరియస్ అయిన శివమొగ్గలోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం 58మందిని సస్పెండ్ చేసింది. అలాగే హిజాబ్ కు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న కొందరిమీద 144 సెక్షన్ ఉల్లంఘన కింద శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.