భళా కంబళ.. తొలిసారిగా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో నిర్వహణ.. ఏమిటీ పోటీలు.. ? (ఫొటోలు)
కంబల పోటీలకు తొలిసారిగా బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు రోజుల పాటు సాగే ఈ గేదెల రేసుకు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఈ పోటీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
![For the first time, Kambala competitions will be held from today at Palace Ground in Bangalore.. Know about these competitions here..ISR For the first time, Kambala competitions will be held from today at Palace Ground in Bangalore.. Know about these competitions here..ISR](https://static-ai.asianetnews.com/images/01e1h21n49vx55zma69xh3ckgh/suresh-shetty--2--jpg_363x203xt.jpg)
నేటి నుంచి కర్ణాటకలో కంబళ పోటీలు జరగనున్నాయి. బెంగళూరులో తొలిసారిగా ప్యాలెస్ గ్రౌండ్ మట్టి ట్రాక్పై గేదెల రేసుకు సిద్ధమయ్యింది. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు నిర్వాహకులు అన్నీ పోటీలు సిద్ధం చేశారు. కంబళను సాధారణంగా కోస్తా కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహిస్తారు.
రోజుల పాటు జరగనున్న ఈ రేసుకు ముందు గురువారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో ట్రయల్ రన్ నిర్వహించారు. మొత్తం 139 జతల గేదెలు ఈ రేసులో పాల్గొననున్నాయి. సాధారణంగా శీతాకాలంలో రైతులు వరి పంటలు పండించే సమయంలో కాసరగోడ్ (కేరళ) నుండి మరవంతే (కర్ణాటక) సముద్రతీర జిల్లాల వరకు విస్తరించి ఉన్న 'తుళునాడు'లో గేదెల పందెం జరుగుతుంది.
ప్రతీ జత గేదెలకు ట్రాక్ పై ఉన్న జంతువులను నియంత్రించడానికి, కమాండ్ చేయడానికి ఒక 'కంబళ రన్నర్' లేదా జాకీ ఉంటారు. ఈ పోటీల విజేతకు 16 గ్రాముల బంగారం, రూ.లక్ష బహుమతిగా ఇవ్వనున్నారు. రన్నరప్ కు 8 గ్రాముల బంగారం, రూ.50 వేలు, రెండో రన్నరప్ కు 4 గ్రాముల బంగారం, రూ.25 వేలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఈ పోటీలు జరగనున్న ప్రధాన వేదికకు దివంగత ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ పేరు పెట్టారు. ఈ పోటీల నిర్వహణకు దాదాపు రూ.7.5 -8 కోట్ల వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు అంచనా వేశారు. అయితే గేదెలకు కోపం తెప్పించేలా ఫ్లాష్లైట్ను ఉపయోగించకూడదనే షరతుతో ఫొటోగ్రాఫర్ లను ఫొటోలు తీసేందుకు అనుమతి ఇచ్చారు. కాగా.. రేస్ను వీడియో తీసేందుకు నిర్వాహకులు హై ఎండ్ కెమెరాలను ఏర్పాటు చేశారు.