పొగమంచుతో ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి, 25 మందికి గాయాలు..
ఉత్తరప్రదేశ్ లో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా మొరాదాబాద్ హైవే మీద మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. హుసేన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్ లో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా మొరాదాబాద్ హైవే మీద మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. హుసేన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందార్కి సమీపంలో బస్సు- ట్రక్కు ఢీకొన్నాయి. ఈ రెండింటి మధ్య మరో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ సంఘటనలో పది మంది మృత్యువాత పడ్డారు. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ప్రమాదానికి కారణం పొగ మంచు అని తెలుస్తోంది. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో దారి సరిగా కనపడకే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదం గురించి మొరాదాబాద్ ఎస్ఎస్పీ మాట్లాడుతూ.. రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని, సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు.
అయితే పొగమంచుతో పాటు ఓవర్ టేకింగ్ కు ప్రయత్నించడం వల్లే వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పినట్లు తెలిపారు. కాగా ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
దీంతోపాటు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 5 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.