పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 35 కంపెనీల కేంద్ర బలగాలు ఈ నియోజకవర్గంలో మోహరించాయి. ఉదయం 11 గంటలకల్లా ఇక్కడ 21.73శాతం పోలింగ్ శాతం నమోదైంది. 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం(CM) కుర్చీకి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. మమతా బెనర్జీ(Mamata Banerjee) ముఖ్యమంత్రిగా తన భవితవ్యానికి పరీక్ష జరుగుతున్నది. ఆమె పోటీ చేస్తున్న భవానీపూర్(Bhabanipur) నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకే ఓటింగ్ స్టార్ట్ అయింది. కట్టుదిట్టమైన భద్రత, కరోనా ముందుజాగ్రత్తలతో పశ్చిమ బెంగాల్‌లో ఉపఎన్నికలు మొదలయ్యాయి. ఉదయం 11 గంటల కల్లా భవానీపూర్‌లో 21.73శాతం ఓటింగ్ శాతం నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా ప్రియాంక తబ్రేవాల్, సీపీఎం నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ రోజు భవానీపూర్ సహా సంసేర్‌గంజ్, జంగిపూర్‌లలోనూ ఉపఎన్నిక జరుగుతున్నాయి. బెంగాల్‌తోపాటు ఒడిశాలోని పిప్లీలోనూ ఉపఎన్నిక జరుగుతున్నది. ఉదయం 11 గంటలకల్లా సంసేర్ గంజ్‌లో 40.23శాతం, జంగిపూర్‌లో 36.11శాతం ఓటింగ్ శాతం నమోదైంది.

ఇటీవలే జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించినప్పటికీ సువేందు అధికారిపై ఆమె ఓడిపోయారు. టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రిగా ప్రమాణం తీసుకున్న ఆరు నెలల్లోపు ఆమె శాసనసభకు ఎన్నిక కావల్సి ఉన్నది. లేదంటే మంత్రి పదవి కోల్పోతారు. అందుకే ఈ ఎన్నికకు ప్రాధాన్యత సంతరించింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలోనూ మమతా బెనర్జీకి ఈ ఎన్నిక ఒక లిట్మస్ పరీక్ష అని చెబుతున్నారు.

ఉపఎన్నికతో దేశమంత బెంగాల్‌వైపు చూస్తున్నారు. ముఖ్యంగా భవానీపూర్ ఉపఎన్నికపైనే అందరి దృష్టి ఉన్నది. ఈ ఉపఎన్నికల కోసం బెంగాల్‌కు 72 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. ఇందులో దాదాపు సగం 35 కంపెనీలు కేవలం భవానీపూర్‌లోనే మోహరించడం ఈ ఉపఎన్నిక తీవ్రతను తెలియజేస్తున్నది. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధి మేరకు 144 సెక్షన్ అమలుచేస్తున్నారు.