Shimla: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా ఈ వర్షాకాలంలో 257 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు రూ. 7 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. మరికొన్ని రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
Himachal floods claim 257 lives: వరదలు, కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్ లో రూ.7020.28 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే, హిమాచల్ ప్రదేశ్ లో జూన్ 24న రుతుపవనాల సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి వర్ష సంబంధ వివిధ కారణాలతో 257 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర కారణాలతో 191 మంది ప్రాణాలు కోల్పోయారు. 32 మంది గల్లంతయ్యారనీ, 290 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో 1376 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, వర్షాకాల బీభత్సంలో ఇప్పటివరకు 7935 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో 270 దుకాణాలు దెబ్బతిన్నాయనీ, 2727 గోశాలలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 90 కొండచరియలు విరిగిపడగా, 55 ఆకస్మిక వరద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో 2 జాతీయ రహదారులు సహా దాదాపు 450 రాష్ట్ర రహదారులు మూతపడ్డాయి. 1814 విద్యుత్ సరఫరా కేంద్రాల్లో అంతరాయం ఏర్పడగా, 59 నీటి సరఫరా పథకాలకు ఇంకా అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు.
మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 14న రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగస్టు 14న అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తూ విద్యాశాఖ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్ల (డీసీ) నుంచి ముఖ్యమంత్రి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్లు కూడా ఆయనకు సమాచారం అందింది.
అలాగే, కొండచరియలు విరిగిపడటం, ఇళ్లకు జరిగిన నష్టం గురించి ఆరా తీశారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శితో పాటు అన్ని డీసీలను సీఎం ఆదేశించారు. పరిపాలనా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ, రోడ్లు, విద్యుత్, నీటి ఏర్పాట్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఆగస్టు 14న జరగాల్సిన బీఎడ్ పరీక్షలతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ తరగతులకు సంబంధించి జరుగుతున్న అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లోని ఇళ్లకు ముప్పు పొంచి ఉందని తెలిపింది.
