అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. 6 జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. ప్రజలను రక్షించేందుకు స్థానిక జిల్లాల యంత్రాంగంతో పాటు అస్సాం రైఫిల్స్ బలగాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోపాటు ఆకస్మిక వరదలు అస్సాంలో విధ్వంసం సృష్టించాయి. ఈ వరదల వల్ల ఆరు జిల్లాల్లోని 94 గ్రామాలలో 24,681 మంది ప్రభావితమయ్యాయి. కాచార్, ధేమాజీ, హోజాయ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, నాగావ్, కమ్రూప్ (మెట్రో) వరదల కారణంగా ప్రభావితమయ్యాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
Kashmiri Pandits: కాశ్మీరీ పండిట్లపై దాడులు.. కేంద్రంపై ఫరూక్ అబ్దుల్లా ఫైర్ !
డిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా దిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ ప్రాంతంలో ఒక రహదారి కొంత భాగం కొట్టుకుపోగా, హోజాయ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలను కలిపే PWD రహదారి హోజాయ్ జిల్లాలో శనివారం వరద నీటిలో మునిగిపోయింది.
అస్సాం రైఫిల్స్ సహాయక చర్యలు
ఆయా జిల్లాల్లో వరద పరిస్థితి విషమించడంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. బోర్ఖోలా ప్రాంతంలో నీటి మట్టాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి అస్సాం రైఫిల్స్ను సంప్రదించింది. ఈ బలగాలు వరదల్లో చిక్కుకున్న ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాయి. అస్సాం రైఫిల్స్ తో పాటు జిల్లా యంత్రాంగం పంపిణీ చేసిందని క్యాచర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
అస్సాం రైఫిల్స్ కు చెందిన శ్రీకోనా బెటాలియన్ తో సహా భారత సైన్యానికి చెందిన స్పియర్ కార్ప్స్ కు చెందిన దళాలు అస్సాంలోని కచార్ జిల్లాలోని బలిచరా, బోర్ఖోలా ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టాయి. దిమా హసావో జిల్లాలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో ఈశాన్య సరిహద్దు రైల్వే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.
రూ. 125 కోట్లు విడుల చేసిన కేంద్రం..
వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అస్సాంకు కేంద్ర ప్రభుత్వం సాయంగా నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వరద నియంత్రణ నిధి నుంచి రూ.125 కోట్లను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. నిధులు విడుదల చేసినందుకు జలవనరుల శాఖ మంత్రి పిజూష్ హజారికా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలుసుకుని సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. అస్సాంను వరద ముప్పు లేకుండా చేసే ప్రాజెక్టులను సులభతరం చేసేందుకు రాబోయే రోజుల్లో ఈ పథకం కింద మరిన్ని నిధులు విడుదల చేయాలని హజారికా షెకావత్ను అభ్యర్థించారు.
