జార్ఖండ్‌లోని రాంచీలో ఐదేళ్ల ఏళ్ల బాలికపై స్కూలు ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు.

జార్ఖండ్‌ : జార్ఖండ్‌లోని రాంచీలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల ఏళ్ల బాలికపై ఆమె చదువుతున్న స్కూలు ఆవరణలోనే గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ఎల్‌కేజీ విద్యార్థిని. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "INDIA పాలిత రాష్ట్రంలో 5 ఏళ్ల చిన్నారిపై దారుణమైన అత్యాచారం చేసిన మరో షాకింగ్ సంఘటన. జార్ఖండ్‌లో సిఎం హేమంత్ సోరెన్ పాలనలో ఇప్పటికి 5 అత్యాచార కేసులు నమోదయ్యాయి. పసిపాపపై దారుణంగా అత్యాచారం చేసిన రాక్షసుడిని తక్షణమే అరెస్టు చేయాలి. సాధ్యమైనంత కఠిన శిక్ష విధించాలి" అని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తమిళనాడులో వందేళ్ల తరువాత తొలిసారి ఆలయంలోకి ప్రవేశించిన దళితులు..

ఇదిలా ఉండగా, రాజస్థాన్ లో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. దేశాన్ని కాపాడే బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఓ ఆర్మీ జవాన్ తన భార్య, కూతురిని దారుణంగా హతమార్చాడు. వారు నిద్రపోతుండగా చంపేశాడు. ఆ తరువాత దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అతడిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు రామ్ ప్రసాద్ ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోస్ట్‌మార్టం నివేదికలో వారిద్దరినీ ముందు గొంతు నులిమి చంపి, తరువాత కాల్చడంతో.. తీవ్రమైన కాలిన గాయాలతో మరణించినట్లు తెలిందని.. దీంతో అతడిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

విషయం తెలిసి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న తరువాత మంగళవారం పోస్టుమార్టం నిర్వహించినట్లు తూర్పు డీసీపీ అమృత దుహన్ తెలిపారు. "తల్లీకూతుళ్లిద్దరినీ మొదట గొంతు నులిమి చంపి.. ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లుగా తేలింది’ అని దుహాన్ చెప్పారు.

పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా పోలీసులు రామ్ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన భార్య రుక్మీనా (25), కుమార్తె రిధిమా (2) ను తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు అధికారి తెలిపారు. సిక్కింకు చెందిన రామ్ ప్రసాద్ నేపాల్‌కు చెందిన రుక్మీనాను జనవరి 2020లో వివాహం చేసుకున్నాడు. 

ఆ తరువాత ఆగస్టు 2020లో అతనికి జోధ్‌పూర్‌లో పోస్టింగ్ వచ్చింది. పెళ్లైన నాటినుంచి భార్యాభర్తలిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని దుహాన్ చెప్పాడు. "ఈ గొడవల కారణంగా అతను తన భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. ఆమెను చంపడానికి పథకం పన్నాడు. ఆమెకు సంబంధించిన అన్ని బాధ్యతల నుండి బయటపడాలనుకున్నాడు. అందుకే తమకు పుట్టిన చిన్నారిని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు" అని దుహాన్ చెప్పాడు.

తెల్లవారుజామున 4 గంటలకు మంచంపై నిద్రిస్తున్న సమయంలో అతను మొదట తన భార్యను, ఆపై కుమార్తెను గొంతు నులిమి చంపాడని, ఆపై సాక్ష్యాలను తొలగించడానికి పెట్రోల్ పోసి తగులబెట్టాడని అధికారి తెలిపారు.

ఆ తర్వాత దీన్ని ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. వెంటనే కూలర్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి, తన భార్య, బిడ్డ కాలిపోయారని, వారిని కాపాడేందుకు తానెంతో ప్రయత్నించానని చెప్పి కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడని దుహాన్‌ తెలిపారు.

రామ్ ప్రసాద్ ఉద్యోగంలో 'నాయక్' నుంచి 'క్లార్క్'గా ఇటీవలే పదోన్నతి పొందాడు. సోమవారం దీనికి సంబంధించిన శిక్షణ కోసం బెంగళూరుకు బయలుదేరబోతున్నాడని పోలీసులు తెలిపారు. పోలీసులు, ఆర్మీ అధికారులు మొదటి నుంచి రామ్‌ప్రసాద్‌పై అనుమానం వ్యక్తం చేశారు. రామ్‌ప్రసాద్‌పై సుబేదార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 302 కింద కేసు నమోదు చేశారు.