దారుణం : ఒకే కుటుంబంలోని ఐదుగురి ప్రాణాలు బలి తీసుకున్న రూ. లక్ష అప్పు...
ఆర్థికపరమైన ఒత్తిడి, పొరుగువారితో వివాదాలతో తాము ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లుగా సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తండ్రి పిల్లలను గొంతు నులిమి చంపి, ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. తమ మరణాలకు న్యాయం కావాలని కోరాడు.
![Five five members of one family commit suicide over Rs. Lakh debt in karnataka - bsb Five five members of one family commit suicide over Rs. Lakh debt in karnataka - bsb](https://static-ai.asianetnews.com/images/01h8prhr4p08111shb3e0r3tvg/edu_363x203xt.jpg)
కర్ణాటక : లక్ష రూపాయల అప్పు తీర్చలేక ఓ కుటుంబం అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని సదాశివనగర్లో వెలుగు చూసింది. రూ. లక్ష అప్పు వారి బలవన్మరణాలకు కారణమయ్యింది. మృతుల్లో గరీబ్ సాబ్ (32), అతని భార్య సుమయ్య (30), వారి కుమార్తె హజీరా (14), కుమారులు మహ్మద్ సుభాన్ (10), మహ్మద్ మునీర్ (8)లు ఉన్నారు. కర్ణాటక తుమకూరులోని సదాశివనగర్ 3వ క్రాస్లో గతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది ఈ కుటుంబం. వీరు నాలుగు నెలల క్రితమే సదాశివనగర్కు వచ్చారు.
వీరి మృతదేహాల దగ్గర రెండు పేజీల సూసైడ్ నోట్ దొరికింది. దీంట్లో అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నామని పేర్కొన్నారు. ఈ కుటుంబం నగరంలోని మేలెకోటేలో కబాబ్ దుకాణాన్ని నడుపుతోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గరీబ్ సాబ్ ఒక వీడియోను రికార్డ్ చేశాడు. ఘటన విషయం తెలియగానే ఎస్పీ అశోక్ వెంకట్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తిలక్పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు.
7:30 గంటలకు పోలీసులకు ఒక ఫోన్ వచ్చింది. ఒక కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిపారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వేగంగా స్పందించిన అధికారులు ఐదు నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని మొదట ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు. మరో ముగ్గురు చిన్నారులు మంచాలపైనే మృతి చెంది కనిపించారు. కుటుంబం ఇక్కడికి శిరా తాలూకా లక్కనహళ్లి నుండి వచ్చింది.
విషాదకరమైన సంఘటనకు ముందు, గరీబ్ సాబ్ బంధువులకు సెల్ఫీ వీడియో పంపాడు. అందులోని వివరాల ఆధారంగా దర్యాప్తు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. పోలీసులు తీసుకోవలసిన చర్య వీడియో కంటెంట్, దాఖలు చేసిన ఫిర్యాదు రెండింటిపై ఆధారపడి ఉంటుంది. కబాబ్ దుకాణం నిర్వహిస్తున్న గరీబ్ సాబ్ ఏడాది కాలంగా సదాశివనగర్లో నివాసం ఉంటున్నట్లు తుమకూరు ఎస్పీ అశోక్ కేవీ ధ్రువీకరించారు. దొడ్డమ్మ అనే మహిళను ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్లో, గరీబ్ సాబ్ తాను చేసిన అప్పు, వ్యాపారంలో నష్టాలు రావడం చెప్పుకొచ్చాడు.
వీటితో జీవనోపాధి సవాలుగా మారడం... ఆర్జించడంలో ఇబ్బందులు, చెల్లింపు బాధ్యతలు, అద్దె ఇంటికి బకాయిలను ప్రస్తావించారు. గరీబ్ సాబ్ తన భార్య సోదరుడు సాదిక్, ఆమె చెల్లెలు యాసిన్ ద్వారా విషప్రయోగం చేయడమే తాము ఇక్కడికి రావడానిక కారణమని పేర్కొన్నాడు. నోట్లో అప్పులకు గానూ గృహోపకరణాలను ఇచ్చేయాలని సూచించాడు. వస్తువులను పంపిణీ చేయడానికి నిర్దిష్ట సూచనలను చేశారు.
అత్తకు పదిహేను వేలు, అన్నయ్య అజాజ్కు బైక్, కోడలు పర్వీన్, సోదరుడికి ఫోన్. దొడమ్మ కొన్ని వస్తువులను ఉంచుకోవడమో అమ్ముకోవడమో చేయొచ్చని తెలిపాడు. గరీబ్ సాబ్ డబ్బులు, ఆహారం అందించినందుకు మత్తర్ మామికి కృతజ్ఞతలు తెలియజేసాడు. ఇరుగు పొరుగు వారు నీఛంగా చూడడం, వారి వేదింపులు కూడా తమ మరణాలకు కారణమని తెలిపాడు.
రుణదాతలు, కుటుంబ సభ్యులు, షబానా- ఖలందర్ల మధ్య సంబంధం ఈ లెటర్ లో చెప్పడం.. వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతోనే విషాదకరమైన మరణాలు సంభవించాయి. వీరివల్లే తాము చనిపోతున్నామని తెలిపాడు. తమ పిల్లలు చనిపోయారా లేదా చూడాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఖలందర్కు శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. పోలీసు అధికారులను ఉద్దేశించి.. తమ మృతదేహాలకు పోస్ట్మార్టం చేయద్దని విజ్ఞప్తి చేశాడు.
"చనిపోయిన వారందరూ షిరా తాలూకాలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందినవారని ధృవీకరించాం. ఇద్దరు ఉరివేసుకుని, ముగ్గురు గొంతునులిమి చంపబడ్డారు. దొరికిన నోట్ ప్రకారం, తండ్రి దీనికి బాధ్యుడని తెలుస్తుంది. ఇది హృదయ విదారకంగా ఉంది. ఆత్మహత్యకు ముందే పిల్లల గొంతు నులిమి చంపేశాడు. బాధితులను ఆదుకునేందుకు సీఎం ఫండ్ ద్వారా సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ మృతుడి ఇంటిని సందర్శించిన సందర్భంగా తెలిపారు.