కేరళలో మంకీ ఫీవర్ కలకలం సృష్టిస్తోంది. ఈ ఏడాది అక్కడ మంకీ ఫీవర్‌ తొలి కేసు నమోదవడం ఇదే తొలిసారి. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి డెంగీ లక్షణాలు ఉంటాయని, 5-10 శాతం మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు.  

ఇప్పటికే కరోనా మహమ్మారితో (coronavirus) కేరళ (kerala) వణికిపోతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం భారీగానే కేసులు నమోదవుతున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. కరోనాతో చస్తుంటే తాజాగా మంకీ ఫీవర్‌ (monkey fever) కేరళలో కలకలం సృష్టిస్తోంది. వయనాడ్‌ జిల్లాకు (wayanad district) చెందిన 24 సంవత్సరాల యువకుడికి తాజాగా మంకీ వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సకీనా ధ్రువీకరించారు. ఆరోగ్య అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశామని, స్థానిక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం యువకుడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, మనవంతవాడి మెడికల్‌ కాలేజీలో చేర్చగా.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వైద్యాధికారి పేర్కొన్నారు. అయితే, ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్‌ తొలి కేసు నమోదవడం ఇదే తొలిసారి. మంకీ ఫీవర్‌ ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన వైరస్‌ ద్వారా సోకుతుందని నిపుణులు పేర్కొన్నారు. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి డెంగీ లక్షణాలు ఉంటాయని, 5-10 శాతం మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు.