ఉత్తరప్రదేశ్లోని బృందావన్ హోటల్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
Vrindavan hotel: మధుర-బృందావన్ రోడ్లో ఉన్న హోటల్ పై అంతస్తులోని కిచెన్ స్టోర్ రూమ్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి రెండు అంబులెన్స్లు, రెండు ఫైర్ టెండర్లు చేరుకున్నాయి.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లోని ఓ హోటల్లో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. హోటల్ బృందావన్ గార్డెన్లో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను హోటల్లో పనిచేస్తున్న ఉమేష్ (30), బీరి సింగ్ (40)గా గుర్తించారు.
మధుర-బృందావన్ రోడ్లో ఉన్న హోటల్ పై అంతస్తులోని కిచెన్ స్టోర్ రూమ్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలానికి రెండు అంబులెన్స్లు, రెండు ఫైర్ టెండర్లు చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత, మొదటి అంతస్తులో (హోటల్) స్టోర్ రూమ్లో మంటలు ఉన్నట్లు గుర్తించబడింది. ప్రమాద సమయంలో హోటల్లో దాదాపు 100 మంది అతిథులు ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు వారందరినీ వెంటనే ఖాళీ చేయించారు. కొంతసమయం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక శాఖ దాదాపు గంటపాటు మంటలను ఆర్పడానికి శ్రమించిందని మధుర చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ శర్మ తెలిపినట్టు ఎన్ఐ నివేదించింది.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదనీ, ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే కనిపిస్తోందని బృందావన్ ఎస్హెచ్ఓ సూరజ్ శర్మ తెలిపారు. డాక్టర్ భుదేవ్ సింగ్ (సీఎంవో) ప్రకారం ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం వల్ల ఎర్పడిన పొగతో ఊపిరిపీల్చుకోవడంలో ఇబ్బందిపడటం.. శరీరం కాలిపోవడం కారణంగా వారు మరణించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన బిజేంద్ర సింగ్ను ఆగ్రా ఆసుపత్రికి తరలించారు. కాగా, హోటల్కు అగ్నిమాపక శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లేదని మూలాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ హోటల్కు నోటీసులు కూడా అందజేసింది. కేసు నమోదుచేసుకుని ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో ఒకరు మృతి
ఉత్తరప్రదేశ్ లోని బుధవారం చోటుచేసుకున్న మరో అగ్నిప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సహరాన్పూర్ లో ఉన్న పేపర్ మిల్లు గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంలో 50 ఏళ్ల వ్యక్తి కాలి బూడిదయ్యాడని పోలీసులు తెలిపారు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టార్ పేపర్ మిల్లు గోడౌన్లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) విపిన్ తాడా తెలిపారు.
కొన్ని పేపర్ బండిల్స్ మధ్యలో నిద్రిస్తున్న లాల్ బహదూర్ అనే గోడౌన్ ఉద్యోగి లోపల ఇరుక్కుపోయి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో పాటు కోట్లాది రూపాయల విలువైన కాగితాలు కూడా దగ్ధమైనట్లు ఎస్పీ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు మిల్లులో విధులు నిర్వహిస్తున్నారనీ, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని ఎస్ఎస్పీ తెలిపారు.
ముంబయిలోనూ..
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కూడా బుధవారం ఒక పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదర్లోని ఛబిల్దాస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ టెర్రస్పై అగ్నిప్రమాదం సంభవించిందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని పేర్కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సియోన్ ఆస్పత్రికి తరలించారు.