యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీభర్త రాబర్ట్ వాద్రాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గురుగ్రామ్ లో భూ అవకతవకల కేసులో వాద్రాతోపాటు హర్యాణా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఢిల్లీ : యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీభర్త రాబర్ట్ వాద్రాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గురుగ్రామ్ లో భూ అవకతవకల కేసులో వాద్రాతోపాటు హర్యాణా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

భూ కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సురేందర్‌ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో మన్నేసర్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ రాజేశ్‌ కుమార్‌ కేసు నమోదు చేశారు. డీఎల్‌ఎఫ్‌, ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ సంస్థల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. 

భూపిందర్‌ సింగ్‌ హుడా సీఎంగా ఉన్న సమయంలో వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ సంస్థ గురుగ్రామ్‌లో భూమిని రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ భూమిని డీఎల్‌ఎఫ్‌ సంస్థకు రూ.58 కోట్లకు అమ్మిందని ఫిర్యాదు దారుడు సురేందర్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అందుకు ప్రతిఫలంగా డీఎల్‌ఎఫ్‌ సంస్థకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 350 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని ఇదంతా క్విడ్‌ప్రోకో రీతిలో జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో డీఎల్‌ఎఫ్‌కు రూ.5000 కోట్లు లాభం వచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు.

అయితే తనపై వస్తున్న ఆరోపణలను రాబర్ట్ వాద్రా ఖండించారు. భాజపా ప్రభుత్వం ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇది ఎన్నికల సీజన్‌, ఓవైపు పెట్రోల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. 

ఇలాంటి సమయంలో ప్రజాసమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో కొత్తేం ఉందని రాబర్ట్ వాద్రా అన్నారు.