ఐటీ పోర్టల్లో అవాంతరాలపై ఇన్ఫోసిస్ను వివరణ కోరిన ఆర్ధికశాఖ.. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందన
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ను కేంద్రం ప్రారంభించింది. అయితే రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ ఇందులో ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. ఈ క్రమంలోనే వీటిని పరిష్కరించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్ను కోరారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తీసుకొచ్చిన కొత్త పోర్టల్లో ఎదురవుతున్న అవాంతరాలను ఇంకా పరిష్కరించని ఇన్ఫోసిస్పై కేంద్ర ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వివరణ కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో సలీల్ పరేఖ్కు ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సైతం ఈ వ్యవహారంపై స్పందించారు.
‘‘ క్లిష్టమైన ప్రభుత్వ సాంకేతిక పరిష్కారాలపై పనిచేస్తున్న ఇండియన్ టెక్ కాస్, ఈ అంచనాలను ప్రత్యేక బాధ్యతగా పరిగణించాలి. ఇందుకోసం వారి ఉత్తమ బృందాలను నియమించాలి - ఇవి ముఖ్యమైనవి, ఎందుకంటే ఈ అంచనాలు భారతదేశ ప్రజలను ప్రభావితం చేస్తాయి ’’ అని రాజీవ్ చంద్రశేఖర్ ఆదివారం ట్వీట్ చేశారు.
కాగా, జూన్ 7న కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ను కేంద్రం ప్రారంభించింది. అయితే రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ ఇందులో ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ట్యాక్స్ పేయర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వీటిని పరిష్కరించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్ను కోరారు. ఈ పోర్టల్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయాలని ఆదేశించారు.
యూజర్లకు పని సులువు చేయడానికి ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చినా.. ఇందులోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ను వేగిరం చేసి, రీఫండ్లను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ కొత్త పోర్టల్ను తీసుకొచ్చింది. 2019లో దీని కాంట్రాక్ట్ను ఇన్ఫోసిస్ సొంతం చేసుకుంది.