Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు.. హాస్పిటల్లో పేషెంట్.. దేశంలో మొత్తం కేసులు ఎన్నంటే?
ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. పేషెంట్ ప్రస్తుతం ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుతో ఢిల్లీలో మొత్తం మంపీక్స్ కేసులు ఐదుకు చేరాయి. కాగా, దేశంలో ఈ సంఖ్య పదికి పెరిగింది.
న్యూఢిల్లీ: మంకీపాక్స్ కేసులు నెమ్మదిగానైనా నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో కేసు నమోదైంది. మంకీపాక్స్ బారిన పడ్డ పేషెంట్ లోక్ నాయక్ జై శక్తి హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఢిల్లీలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కాగా, దేశం మొత్తంలో ఈ కేసుల సంఖ్య 10కి పెరిగింది.
ఇప్పటి వరకు ఈ హాస్పిటల్లో ఐదుగురు మంకీపాక్స్ పేషెంట్లు జాయిన్ అయ్యారు. ఇందులో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. అంటే ప్రస్తుతం ఇంకా నలుగురు ఈ హాస్పిటల్లో మంకీపాక్స్ వైరస్ నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ పేషెంట్లకు చికిత్స అందించడానికి ప్రత్యేక వైద్యబృందాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే మార్గదర్శకాలు వెలువరించింది. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే అంశాలను వెల్లడించింది. ఈ జాగ్రత్తలు పాటించి మంకీపాక్స్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తితో తరుచూ కాంటాక్ట్లోకి వచ్చినా.. దీర్ఘకాలం కలిసి ఉన్నా వైరస్ సోకవచ్చని వివరించింది.
ఈ వైరస్ సోకిన వారిని వెంటనే ఐసొలేట్ చేయాలని, తద్వార అది ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోవాలని కేంద్రం తెలిపింది. ప్రజలు తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, ముఖానికి మాస్కులు పెట్టుకోవాలని, చేతులకూ గ్లౌజులు పెట్టుకోవాలని వివరించింది.