కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు.. దేశంలో మొత్తం ఎన్ని కేసులంటే?
కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి గత నెల 27న కోళికోడ్ ఎయిర్పోర్టుకు చేరిన 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.
తిరువనంతపురం: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంగళవారం ఇక్కడ మరొకరికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. 30 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ అని తేలిందని వివరించారు. ఆయన కూడా యూఏఈ నుంచి తిరిగి వచ్చాడని తెలిపారు.
యూఏఈ నుంచి గత నెల 27న కోళికోడ్ ఎయిర్పోర్టుకు ఆయన చేరుకున్నట్టు రాష్ట్ర మంత్రి వీణా జార్జి చెప్పారు. ప్రస్తుతం ఆయన మళప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీ చికిత్స పొందుతున్నారని తెలిపారు.
దీంతో కేరళలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కాగా, దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరింది.
మంకీపాక్స్తో తొలి మరణం కేరళలోనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మరణంతో త్రిస్సూర్ జిల్లాలో 20 మందిని క్వారంటైన్లోకి చేర్చినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. మరణించిన ఆ వ్యక్తి.. కుటుంబ సభ్యులు, మిత్రులు మొత్తంగా పది మందితో కాంటాక్ట్లోకి వెళ్లినట్టు తెలిపారు.