నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనతో తొక్కిసలాట.. పలువురికి గాయాలు
నోయిడాలోని సెక్టార్-93 మురికివాడల్లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఆదివారం సాయంత్రం ఇక్కడ మంటలు చెలరేగాయి. దీంతో కిలోమీటర్ల మేర పొగలు కమ్ముకుంటుంది.
నోయిడాలో అగ్నిప్రమాదం: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో పెనుప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్-93లోని మురికివాడల్లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. గెజా గ్రామంలోని ఓ ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్లో ప్రమాదశాత్తు మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో పేలుడు పదార్థాలు పడటంతో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కిలోమీటర్ల మేర పొగలు కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సంఘటనా స్థలానికి చేరుకుంది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం భారీ ఎత్తున జరగడంతో ఘటనా స్థలంలో డజను అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో.. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీయడం చూడవచ్చు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు.
అగ్నిప్రమాదం గల కారణాలపై ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక ఫేజ్ 2 పోలీస్ స్టేషన్కు చెందిన అగ్నిమాపక దళం, సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారని, ఘటన స్థలంలో రెస్క్యూ , అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు. అనేక అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. రెండు వారాల క్రితం గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు, అయితే మంటలను ఆర్పడానికి 15 ఫైర్ ఇంజన్లు 10 గంటల సమయం పట్టింది. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 40 మంది వరకు ఉండగా, మంటలు వ్యాపించక ముందే అందరూ తప్పించుకున్నారు.
ఘజియాబాద్లో అగ్నిప్రమాదం
ఘజియాబాద్లోని లోనీలో అగ్నిప్రమాదం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ట్రోనికా సిటీ ప్రాంతంలోని నివాస కాలనీలో ఖాళీ మైదానం ఉంది, ఇక్కడ చాలా చెత్త సేకరించబడుతుంది. కాశ్మీరీ ఎన్క్లేవ్ కాలనీలోని ఈ ఖాళీ మైదానంలో ఆదివారం అర్థరాత్రి పొదలకు మంటలు అంటుకున్నాయి. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి.