అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని లక్షల రూపాయలిచ్చి కొనుగోలు చేసిన ఓ దుర్మార్గుడు పెళ్లాడిన ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
జైపూర్ : ఏడేళ్ల చిన్నారిని 30 ఏళ్ల వ్యక్తి పెళ్ళి చేసుకున్న అమానుషం రాజస్థాన్ లో వెలుగుచూసింది. నిరుపేద తల్లిదండ్రులకు డబ్బులు ఆశజూపి అభం శుభం తెలియని బాలికను కొనుగోలుచేసాడు దుర్మార్గుడు. కూతురు వయసున్న ఆ బాలికను ఈ ముదురు వయస్కుడు పెళ్ళాడాడు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్ పూర్ జిల్లా మానియా ప్రాంతానికి చెందిన భూపాల్ సింగ్(30) ఏడేళ్ల బాలికను కొనుగోలుచేసాడు. రూ.4.5 లక్షలు తీసుకుని కన్న తండ్రే బాలికను ఇతడికి అమ్మేసాడు. ఇలా లక్షలాది రూపాయలతో కూతురు వయసున్న చిన్నారిని కొనుక్కుని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి మూడ్రోజుల క్రితమే జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ బాల్యవివాహం గురించి సమాచారం అందడంతో ధోల్ పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ రంగంలోకి దిగారు. మానియా డిఎస్పీ దీపక్ ఖండేల్వాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి ఈ అసహజ వివాహంపై విచారణ చేపట్టారు. బాలిక అమ్మకం, వివాహం గురించి తల్లిదండ్రుల నుండి సమాచారం సేకరిస్తున్నారు.
Read More సంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి.. !
బాలికను అమ్మిన తండ్రితో పాటు కొనుగోలు చేసి పెళ్లాడిన భూపాల్ సింగ్ పైనా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ఇంకా ఎవరెవరికి సంబంధం వుందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టామని... త్వరలోని పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
