Electric Bike Explodes: తమిళనాడులో ఎలక్ట్రిక్ బైకు పేలి తండ్రీకూతుళ్లు.. చనిపోయారు. ఈ ఘటన వెల్లూరు సమీపంలోని అల్లపురంలో ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో ఈ బైక్ పేలి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ఇద్దరూ మరణించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల బైక్ పేలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
Electric Bike Explodes: తమిళనాడులో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ బైకు పేలి తండ్రీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వేలూరులోని ఓల్డ్ టౌన్ సమీపంలోని చిన్న అల్లాపురంలో చోటు చేసుకుంది. ఘటనలో బైక్ ఓనర్ దురైవర్మ(49)తో పాటు ఆయన కూతురు మోహన ప్రీతి(13) దుర్మరణం పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాపురంలోని టోల్గేట్ సమీపంలో ఎం.దురైవర్మ(49) చాలా ఏళ్లుగా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ.. జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన కొత్త ఈ-బైక్ను కొనుగోలు చేశారు. రోజువారి లాగానే.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్ను ఛార్జింగ్ పెట్టారు. అయితే విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ-బైక్లో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేయబోయారు. అయితే పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు తండ్రీకూతుళ్లు.
మంటల్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు.. రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసే లోపే.. ఆ పొగలో దురై, ప్రీతీలు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. బాధితులపై ఎటువంటి కాలిన గాయాలు కనిపించకపోవడంతో వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరణి మార్గంలోని అడుక్కంపరైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. బాగాయం పోలీసులు కేసు నమోదు చేశారు. చార్జింగ్ సాకెట్ పాతదని, దాని వోల్టేజీ కెపాసిటీ తక్కువని, షార్ట్ సర్క్యూట్ వల్ల బైక్ పేలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
బాధితుడు దురైవర్మ తొమ్మిదేళ్ల క్రితం 2013లో తన భార్యను కోల్పోయాడని, అప్పటి నుంచి మెరుగైన చదువు కోసం తన కుమార్తెను తిరువణ్ణామలై సమీపంలోని పోలూరులోని పాఠశాలలో చదివిస్తున్నారు. చాలా రోజుల తర్వాత అతడిని చూసేందుకు కూతురు ఇంటికి వెళ్లింది. ఇంతలోనే ఇలా కావడంతో గ్రామస్థుల్లో విషాదఛాయాలు అలుముకున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు పేలడం కొత్తేమీ కాదు. టెస్లా, హ్యూందాయ్ ల కంపెనీలకు చెందిన వాహనాలు కూడా పేలిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవేనా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు ఉన్న వాహనాల కన్నా ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే వాహనాలు పేలిపోయే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. చార్జింగ్ ఫుల్ అయినప్పటికీ అలాగే పెట్టి ఉంచడం వల్ల బ్యాటరీల్లో వేడి పెరిగి పేలిపోతున్నట్టు పేర్కొన్నారు. చార్జింగ్ ఫుల్ కాగానే ప్లగ్ను తొలగించాలని సూచిస్తున్నారు.
