Farmers meet: మరో పోరుకు సిద్ధమవుతున్న రైతాంగం.. భవిష్యత్ కార్యచరణపై లఖింపూర్ఖేరీలో సమావేశం !
Lakhimpur Kheri: లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన కాన్వాయ్ ని పోనిచ్చిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.
farmer unions: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పుడు దేశవ్యాప్తంగా రైతాంగం ఉద్యమించింది. ఢిల్లీ సరిహద్దుల్లో పోరు సాగించింది. దాదాపు ఏడాదిన్నరకు పైగా రైతులు ఉద్యమించడం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతు మహాపంచాయత్ లను నిర్వహించడంతో కేంద్ర వెనక్కి తగ్గింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణలు చెబుతూ.. ఆ మూడు వ్యవసా చట్టాలను వెనక్కి తీసుకుంది. వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసింది. దీంతో రైతులు నిరసనను విరమించుకున్నారు. ఆ సమయంలో పంటకు గిట్టుబాటు ధర, ఎంఎస్పీ సహా రైతులు చేసిన డిమాండ్లను, సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు లఖింపూర్ ఖేరీ ఘటనలో రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైన కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా కేసు విషయంలో కేంద్రం తీరును రైతులు తప్పుబడుతున్నారు. మరోసారి కేంద్రంపై రైతులు పోరుకు సిద్ధమవుతున్నారని సమాచారం. రైతులు ఇదివరకు ప్రకటించిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25 రైతు సంఘాల ప్రతినిధులు నేడు లఖింపూర్ లో సమావేశమవుతున్నారు. ఇందులో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ కూడా పాల్గొంటున్నారు. రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణ పై ఈ సమావేశం జరుగుతున్నదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో మరోసారి ఖింపూర్ ఖేరీ వార్తల్లో నిలిచింది.
ఈ సమావేశం అనంతరం రైతు సంఘాలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. సంబంధిత వర్గాల ప్రకారం.. రైతుల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఆశిష్ మిశ్రా కేసు.. ప్రభుత్వ తీరు, రైతు డిమాండ్లు, సమస్యలపై మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గురువారం జరిగే భేటీ తర్వాత లఖింపూర్ ఖేరీ కేసులో త్వరితగతిన విచారణ జరిపించాలని కోరుతూ రైతు సంఘం సభ్యులు స్థానిక అధికారులను కూడా కలవనున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినప్పటికీ హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతుండటంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదివరకు రైతు సంఘాలతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.
కాగా, లఖింపూర్ఖేరీ హింస కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. నలుగురు రైతులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. లఖింపూర్ఖేరీ కోర్టులో రైతుల తరపున న్యాయవాది హర్జీత్ సింగ్ మాట్లాడుతూ.. "ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపినందుకు జైలులో ఉన్న తమ రైతు సోదరులకు మద్దతుగా నాలుగు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు ఖేరీలో సమావేశమవుతారు. 'మంత్రి కుమారుడిపై చేసిన వాంగ్మూలాలను మార్చుకోవాలని అధికారులు జైల్లో ఒత్తిడి తెస్తున్నారని' వారి కుటుంబీకులు వాపోయారు. రాకేష్ టికాయత్ మరియు ఇతర రైతు సంఘాల ప్రతినిధులు జిల్లా మేజిస్ట్రేట్ మరియు పోలీసు చీఫ్ను కలుస్తారు అని తెలిపారు. షాజహాన్పూర్లోని వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మంజీత్ ధలివాల్ మాట్లాడుతూ.. "సాక్షులకు తక్షణ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సాక్షులపై ఇప్పటికే రెండు దాడులు జరిగాయి మరియు ఎఫ్ఐఆర్ ఉన్నప్పటికీ నిందితులపై ఇంకా చర్యలు లేవు" అని పేర్కొన్నారు. అలాగే, రైతులు మే 10 లఖింపూర్ ఖేరీలో రైతు మహాపంచాయత్ ను నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.