కేంద్రంతో చర్చల్లేవ్... మాకు కావాల్సింది అదే: ఆందోళన కొనసాగిస్తున్న రైతులు
షరతులతో కూడిన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆందోళన చేస్తున్న రైతులు తిరస్కరించడంతో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం (నవంబర్ 29) రాత్రి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో సమావేశమయ్యారు.
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేసేలా వున్నాయంటూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇలా నిరసనకు దిగిన రైతులతో చర్చించేందుకు కేంద్రం సిద్దమైన రైతులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. షరతులతో కూడిన కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఆందోళన చేస్తున్న రైతులు తిరస్కరించడంతో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం (నవంబర్ 29) రాత్రి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో సమావేశమయ్యారు.
జాతీయ రాజధాని సరిహద్దుల్లో నిరసనకు దిగుతున్న రైతు నాయకులను చర్చల కోసం బురారీ మైదానానికి రావాలని కేంద్రం కోరింది. అయితే నిరసనకారులు అందరినీ డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపే అవకాశాన్ని ఇచ్చేవరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దీనిపై చర్చించేందుకే కేంద్ర మంత్రులు బిజెపి అధ్యక్షుడితో సమావేశమయ్యారు.
గత శుక్రవారం హర్యానా- ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు శుక్రవారం నాడు ఛలో డిల్లీకి పిలుపునివ్వగా పోలీసులు ఢిల్లీలోకి వెళ్లేందుకు ఆందోళనకారులను అనుమతివ్వలేదు. అయితే తమను ఢిల్లీలోకి అనుమతించేదాకా తాము ఆందోళనను విరమించబోమని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. చివరకు రైతులను ఢిల్లీలోకి అనుమతించారు పోలీసులు.
పలు రైతు సంఘాలు జేఎసీగా ఏర్పడి ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
వేలాది మంది రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ట్రాక్టర్లు, పాదయాత్ర ద్వారా ఢిల్లీ సమీపానికి ఇవాళ ఉదయానికి చేరుకొన్నారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల వాహానాలను తప్పించుకొని ఢిల్లీ వైపునకు దూసుకొస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఢిల్లీలోకి తమకు అనుమతిని కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రైతులను ఢిల్లీలోకి అనుమతించింది.కరోనా నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఢిల్లీలోకి నిరసనకారులను అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అయితే రైతులు కూడా ఢిల్లీ నగరంలోకి అనుమతించేవరకు నిరసన కొనసాగిస్తామని చెప్పడంతో చివరకి అనుమతించాల్సి వచ్చింది.
ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢీల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.