కారణమిదీ: నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చి... చివరికిలా...
తిరువణ్ణామలై అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు సౌత్ ఇండియా నదుల అనుసంధానం రైతుల సంఘం ఆధ్వర్యంలో వందవాసికి చెందిన చక్రపాణి, కలశపాక్కం తాలుకా మేల్ సామ్కుప్పం గ్రామానికి చెందిన రాజేంద్రన్ ఇద్దరూ తిరువణ్ణామలై వచ్చారు.
చెన్నై: తిరువణ్ణామలై అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు సౌత్ ఇండియా నదుల అనుసంధానం రైతుల సంఘం ఆధ్వర్యంలో వందవాసికి చెందిన చక్రపాణి, కలశపాక్కం తాలుకా మేల్ సామ్కుప్పం గ్రామానికి చెందిన రాజేంద్రన్ ఇద్దరూ తిరువణ్ణామలై వచ్చారు.
అనంతరం తిరువణ్ణామలై తాలుకా కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు పెరియార్ విగ్రహం నుంచి కాలి నడకన నగ్నంగా నడిచి వచ్చారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే దుస్తులు కప్పి నామినేషన్ దాఖలు చేయకుండా నిలిపి వేశారు.
దీంతో ఇద్దరు రైతులు నడి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న అయ్యాకన్నుతో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయ్యాకన్ను మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అమిత్షా రైతుల సంఘాలను ఢిల్లీకి పిలిపించి రూ.6 వేలు పింఛన్ రైతులందరికీ అందజేస్తామని ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు.
రైతులు పండించే పంటలకు రెండింతలు ఇస్తామని, గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆయన తమ డిమాండ్లను ఏమీ పరిష్కరించలేదన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరువణ్ణామలైలో బీజేపీ పోటీ చేసే నియోజక వర్గంలో పోటీచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. దీంతోనే నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చినట్లు తెలిపారు. నగ్నంగా వచ్చిన ఇద్దరు రైతు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.