నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల బ్లాక్ డే: పలు చోట్ల నిరసనలు
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనకు ఆరు మాసాలు పూర్తి కావడంతో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనకు ఆరు మాసాలు పూర్తి కావడంతో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. గత ఏడాది నవంబర్ 26వ తేదీ నుండి రైతు సంఘాల నేతృత్వంలో రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు ఆరుమాసాలు అయింది. దీంతో ఇవాళ బ్లాక్ డే కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో దేశ రాజధానికి నలువైపులా భారీగా పోలీసులు మోహరించారు.
కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరితే స్పందన లేదని రైతు సంఘాల నేత టికాయత్ చెప్పారు. తమ నిరసనను ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశ్యంతో నల్ల జెండాలు ఆవిష్కరించి నిరసన తెలపాలని ఆయన కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఘజియాబాద్ సరిహద్దుల్లో రైతులు నల్ల జెండాలు ఎగురవేసి బ్లాక్ డే పాటించారు. పంజాబ్ లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్ రైతులు బ్లాక్ డే ను పురస్కరించుకొని నల్లజెండాలు ఎగురవేశారు.