పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు మరో మలుపు తిరగనున్నాయి. ఏడాదిపాటు రైతు ఉద్యమాన్ని దిగ్విజయంగా నడిపిన సంయుక్త కిసాన్ మోర్చా కీలక కమిటీ సభ్యుడు, రైతు నేత గుర్నాం సింగ్ చాదుని రేపు చండీగడ్లో నూతన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఉద్యమం చేసిన రైతుల్లో ప్రస్తుత పార్టీలపై ఆశలు సన్నగిల్లాయి. అందుకే, తమ నేతలే ఎన్నికల రాజకీయాల్లోకి దిగాలనే అభిప్రాయాన్ని రైతులు పలుమార్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఏడాదిపాటు పోరాడి మూడు సాగ చట్టాల(Farm Laws)ను రద్దు డిమాండ్ను సాధించుకున్న రైతులు(Farmers) మరో ముందుడు వేశారు. రేపు ఛండీగడ్లో రైతు నేత గుర్నాం సింగ్ చాదుని కొత్త రాజకీయ పార్టీ(New Political Party)ని ప్రకటించే అవకాశం ఉన్నది. ఏడాదిపాటు ఉద్యమం చేసిన రైతుల నుంచి ఆవిర్భవిస్తున్న పార్టీ ఇది. గుర్నాం సింగ్ చాదుని సంయుక్త కిసాన్ మోర్చా కమిటీలో కీలకమైన నేత. కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఏర్పడ్డ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఆయన ఉన్నారు.
తమ డిమాండ్లను సాధించుకోవడానికి 32 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా నడుచుకున్న విధానం అందరినీ ఆకట్టుకున్నది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ, పరిస్థితులు అదుపు తప్పినప్పుడూ ఎస్కేఎం స్పష్టంగా వైఖరి వెల్లడిస్తూ.. పట్టుసడలకుండా వ్యవహరించింది. సంక్షోభ పూరిత వాతావరణంలోనూ రైతు ఉద్యమం నెగ్గి నిలవడానికి ఎస్కేఎం అవలంబించిన విధానాలు ఆదర్శంగా సాగాయి. ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రైతుల డిమాండ్ను అంగీకరించి.. తర్వాత కేంద్రం పార్లమెంటులో ఆ మూడు చట్టాలను రద్దు చేయడంతో రైతులు వెనుతిరిగారు.
Also Read: New Farm laws: సుదీర్ఘ నిరసనకు ముగింపు, సింఘి, టిక్రీ సరిహద్దుల నుండి స్వస్థలాలకు రైతులు
తమ డిమాండ్లు సాధించుకోవడానికి ఏడాదిపాటు ఉద్యమం చేయడం, ఇందులో సుమారు 700 మంది రైతుల ప్రాణాలు కోల్పోవడం వంటివి రైతుల్లో తీవ్ర అసంతృప్తిని నింపాయి. ఈ అసంతృప్తిలో నుంచే ఇప్పుడున్న పార్టీలపై వారికి వ్యతిరేకత పెరిగింది. ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం నిలిపేసి వెనుదిరిగినా రైతులు మాత్రం ఇతర పార్టీలను విశ్వసించే పని చేయలేదు. అందుకే రైతులే స్వయంగా ఎన్నికల రాజకీయాల్లోకి దిగాలనే అభిప్రాయం బలంగా ఉన్నది. సుపరిపాలన చేయకుండా తప్పు దారిలో నడిచే, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని పార్టీలపై వారు విసుగు చెందారని కొందరు రైతులు చెప్పారు. అందుకే ఏడాదిపాటు దిగ్విజయంగా ఉద్యమాన్ని నడిపిన... రైతుల బాధలు స్పష్టంగా తెలిసిన ఈ రైతు నేతలే రాజకీయంలోకి దిగాలనే బలమైన కాంక్ష వారి నుంచి వెల్లడి అవుతున్నది.
Also Read: రైతు సంఘాలకు కేంద్రం నుంచి పిలుపు.. ‘చర్చలు సఫలమైతే ఆందోళన విరమిస్తాం’
ఢిల్లీ నుంచి వెనుదిరిగిన తర్వాత గురువారం ఎస్కేఎంలోని 22 రైతు సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ఏ ఇతర ప్రధాన స్రవంతి పార్టీకి మద్దతు తెలుపవద్దనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, ఎస్కేఎం విడిపోకుండా బలపడటానికి యోచనలు చేయాలనే చర్చలూ జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రేపు గుర్నాం సింగ్ చాదుని కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. దీంతో వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పరిణామాలు ఎదురుకాబోతున్నాయి.
కనీస మద్దతు ధర డిమాండ్పై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు యుధ్వీర్ సింగ్ వెల్లడించారు. ఈ కమిటీలో శివకుమార్ కక్కా, బల్బీర్ సింగ్ రాజేవాల్, అశోక్ ధావ్లే, గుర్నామ్ సింగ్ చాదుని, యుధ్వీర్ సింగ్ ఉన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని కేంద్ర మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డట్టు తెలిపారు. అందుకోసం రైతులు ఒక కమిటీగా కేంద్రాన్ని సంప్రదించాలని సూచనలు చేసినట్టు వివరించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకే తాము ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
