అప్పుల బాధ.. రైతు కుటుంబం బలవన్మరణం..!
చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆర్థిక సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు.
అప్పుల బాధ భరించలేక ఓ రైతు.. తన కుటుంబం సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా శహపుర తాలుకాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... దోరనహళ్లి గ్రామానికి చెందిన భీమరాయ సురవర(45), శాంతమ్మ(36) భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సుమిత(12), శ్రీదేవి(6), శివరాజ్, లక్ష్మి(4) అనే నలుగురు సంతానం ఉన్నారు. వీరికి రెండు ఎకరాల భూమి ఉంది. దానినే సాగుచేసుకుంటూ జీవించేవారు.
సంప్రదాయ పంట కారణంగా నష్టం జరుగుతుందని... ఇటీవల ఉద్యాన పంటకు మారాడు. అయినా.. అతనికి కలిసి రాలేదు. మళ్లీ నష్టాలే చవిచూశాయి. దీంతో...చేసిన అప్పులు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆర్థిక సమస్యలు రోజు రోజుకీ పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయాడు.
దీంతో.. భార్యభర్తలు ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తము పోయాక.. బిడ్డలు అనాథలుకాకుండా వారిని కూడా చంపేయాలని అనుకున్నారు. సురవర.. భార్య, బిడ్డలతో సహా సమీపంలోని ఓ చెరువు వద్దకు వెళ్లి.. అందులోకి దూకేశారు. స్థానికుల సమాచారం సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురి మృతదేహాలు వెలికి తీయగా... మరో ఇద్దరి శవాలు ఇంకా లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.