ఫేక్ న్యూస్ వల్ల ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితమవుతాయి: రాజేష్ కల్రా
"ఎస్టాబ్లిషింగ్ ట్రస్ట్ ఇన్ టైమ్స్ అఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ " అనే అంశంపై ఇంటర్నేషనల్ ఫాక్ట్ చెక్ నెట్వర్క్ డైరెక్టర్ బాబార్స్ ఓర్సెక్, ఏషియా నెట్ న్యూస్ మీడియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా, ఇండియా స్పెండ్ ఫౌండర్ గోవిందరాజ్ ఎతిరాజ్ మాట్లాడారు.
ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవుతున్న తరుణంలో జర్నలిస్టులకు ఫాక్ట్ చెకింగ్ అనేది అతిపెద్ద సవాలుగా మారిందని దీని వల్ల అత్యధిక సమయాన్ని ఆ వార్త నిజానిజాలను నిగ్గుతేల్చడంపై వెచ్చించవలిసి వస్తుందని పబ్ విజన్ కాన్క్లేవ్ లో వక్తలు అభిప్రాయపడ్డారు.
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తొలి డిజిటల్ పబ్లిషింగ్ ఈవెంట్ లో దాదాపుగా 1500 మంది డిజిటల్ పబ్లిషర్స్,బ్రాండ్స్,ఏజెన్సీలు పాల్గొన్నాయి. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో వక్తలు ప్యానెల్ డిస్కషన్ లో ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న అనేక సవాళ్లపై మాట్లాడారు.
ఈ సందర్భంగా "ఎస్టాబ్లిషింగ్ ట్రస్ట్ ఇన్ టైమ్స్ అఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ " అనే అంశంపై మాట్లాడిన వక్తలు అనేక ఉదాహారణలతో అందరికి అర్ధమయ్యే విధంగా ఎదురవుతున్న సవాళ్ల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఇంటర్నేషనల్ ఫాక్ట్ చెక్ నెట్వర్క్ డైరెక్టర్ బాబార్స్ ఓర్సెక్, ఏషియా నెట్ న్యూస్ మీడియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా, ఇండియా స్పెండ్ ఫౌండర్ గోవిందరాజ్ ఎతిరాజ్ ఈ అంశంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజేష్ కల్రా మాట్లాడుతూ... ఫేక్ న్యూస్ వల్ల ఎవరైనా మోసపోవడానికి ఆస్కారం ఉందని, మీడియా సంస్థల్లో న్యూస్ ని త్వరగా అందించాలనే తాపత్రయంతో వల్ల ఇలాంటి పొరపాట్లు జరిగే ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు.
కోకాకోలా షేర్ విలువ ఒక్కసారిగా పడిపోవడానికి రోనాల్డో వాటిని పక్కకు పెట్టడం మాత్రమే ఏకైక కారణం కాదని... ఈ ఉదంతంలో దాగి ఉన్న అనేక అంశాలను మీడియా సంస్థలు పరిగణలోకి తీసుకోకుండా వార్తను ప్రచురించేశాయని అన్నారు. ఈ ఫేక్ న్యూస్ వల్ల ఎన్నికల ఫలితాలు కూడా ప్రభావితమవుతాయని తెలిపారు.
రోజురోజుకి ఎక్కువవుతున్న వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ వల్ల ఫేక్ న్యూస్ అధికంగా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉందని ఈ సందర్భంగా వక్తలు వ్యాఖ్యానించారు.