కాంగ్రెస్తో ప్రశాంత్ కిశోర్ వైరం? ఆయన ట్వీట్ ఏం చెబుతున్నది?
కొంతకాలంగా ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వచ్చాయి. అనంతరం ఆయన చేరికపై పార్టీలో అసంతృప్తులున్నట్టూ గుసగుసలు వినిపించాయి. ఆయన చేరిక అప్పుడా ఇప్పుడా అన్నట్టు ఉన్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ చేసిన ట్వీట్ కొత్త చర్చను తెరమీదకు తెచ్చింది. ఆయన కాంగ్రెస్కు దూరంగా జరిగినట్టు అర్థమవుతున్నది.
న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏం మాట్లాడినా, ఏం ట్వీట్ చేసినా సర్వత్రా ఆసక్తి రేపుతాయి. అందరూ అందులోని మర్మాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. తాజాగా ఆయన కాంగ్రెస్పై చేసిన ట్వీట్ వాటికే తావిచ్చింది. తాను కాంగ్రెస్ నుంచి దూరంగా జరిగినట్టు సూత్రప్రాయంగా ఆ ట్వీట్ వెల్లడిస్తున్నదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్నాళ్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కథనాలు వచ్చాయి. తర్వాత ఆయన చేరికపై పార్టీలోనే భిన్నస్వరాలు వినిపించినట్టూ తెలిసింది. ఎట్టకేలకు ఆయన చేరిక మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా, ఆయన ఆ పార్టీకే దూరంగా జరిగినట్టు వెల్లడిస్తున్నది.
లఖింపూర్ ఖేరిలో జరిగిన ఘటన ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షం వెంటనే పునరుత్తేజం పొందాలని, అకాస్మాత్తుగా బలోపేతం కావాలని కొందరు భావిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. అలాంటి వారు తమను తామే బాధపెట్టుకోవడానికి ప్రయత్నించినట్టని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత బలహీనత అంత సులువుగా పోదని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీలో నెలకొన్న తీవ్ర సమస్యలు అంత సులువుగా సమసిపోవని వెల్లడించారు.
ఇటీవలి రోజుల్లో కాంగ్రెస్ తరుచూ వార్తల్లోకి ఎక్కుతున్నది. పంజాబ్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎంగా రాజీనామా చేసినప్పటి నుంచి పార్టీ చీఫ్గా సిద్దూ రాజీనామా చేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ నేతలలో తీవ్ర గందరగోళం నెలకొంది. అటు చత్తీస్గడ్లోనూ ఎప్పుడు అసంతృప్తి బద్దలవుతుందా? అని కాంగ్రెస్ కలతపడుతున్నది. ఇవి కాంగ్రెస్ పార్టీలోని పాతుకుపోయిన బలహీనతలు, బలమైన సమస్యలను స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ ఈ ట్వీట్ చేశారు.