ఆపరేషన్ సింధూర్: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' నిర్వహించింది. పాకిస్తాన్ గురించి సైనికాధిపతి జనరల్ విజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన ఉగ్రవాద నిరోధక ధోరణిని ఘాటుగా ప్రదర్శించింది. ఇకపై దాడులకు మూగవైఖరి ఉండదని దేశం స్పష్టంగా ప్రకటించింది. ఈ చర్యతో పాకిస్తాన్కి భారత వైఖరి బాగా అర్థమైంది.ఈ క్రమంలో భారత మాజీ సైనికాధిపతి జనరల్ నిర్మల్ చంద్ర విజ్ పాకిస్తాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానల్తో మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత దళాలు పాకిస్తాన్ అంతర్గత ప్రాంతాల్లో ఉన్న లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మొహమ్మద్ శిబిరాలపై సర్జికల్ దాడులు చేశాయని తెలిపారు. భారత్ ఈ చర్యతో పాకిస్తాన్కు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చిందని, ఇక అణు ఆయుధాల బెదిరింపులు దేశాన్ని వెనక్కి తిప్పలేవని స్పష్టం చేశారు.
తన అనుభవాన్ని ప్రస్తావించిన జనరల్ విజ్, పాకిస్తాన్ ఎప్పుడూ మారదని, అబద్ధాలు చెప్పడం దాని సహజ లక్షణమని అన్నారు. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ విరమణ చర్చల్లో పాకిస్తానే ముందుగా వేడుకున్నదని గుర్తుచేశారు. అప్పట్లో DGMO స్థాయి నుంచి పాకిస్తాన్ ప్రతినిధులు భారత్ను సంప్రదించారని వెల్లడించారు.ఇటీవలి కాలంలో జనరల్ విజ్ రాసిన "Alone in the Ring – Decision Making in Critical Times" పుస్తకాన్ని ప్రస్తావిస్తూ, అందులో తాను పాకిస్తాన్ను మతతత్వపరమైన, విశ్వసనీయత లేని దేశంగా వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు ఈ పుస్తకం ఒక సూచనలాగే మారిందని పేర్కొన్నారు.
భారత విదేశాంగ వ్యవస్థ ఈ దాడికి సంబంధించిన మొదటి అధికారిక సమాచారం సమర్థవంతంగా వెల్లడించిందని, ముఖ్యంగా మహిళా అధికారులు సోఫియా ఖురేషి, వ్యోమిక సింగ్లు చేసిన ప్రదర్శన ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. భారత్ తలపెట్టిన దాడి ఉగ్రవాద స్థావరాలపై మాత్రమేనని, పాకిస్తాన్తో యుద్ధం మొదలుపెట్టాలన్న ఉద్దేశమే లేదని ఆయన వివరించారు.కశ్మీర్ను పాకిస్తాన్ ఎల్లప్పుడూ దేశాన్ని ఏకం చేసే పనిముట్టుగా ఉపయోగించిందని, అందుకే వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం కష్టమేనని పేర్కొన్నారు. దేశ భద్రత కోసం భారత్ అవసరమైతే ఏదైనా తేల్చేసే సిద్ధతలో ఉందని జనరల్ విజ్ స్పష్టం చేశారు.