దక్షిణాఫ్రికాలో ఉపయోగించిన ఈవీఎంలను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడారని సమాచారం వచ్చిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని మే 8వ తేదీన కోరింది. ఈ ఆరోపణ అసత్యమని, దక్షిణాఫ్రికాకు ఎప్పుడూ మనం ఈవీఎంలు పంపించలేదని వివరించింది. ఈసీఐఎల్‌ నుంచి కొత్త ఈవీఎంలను తెచ్చి ఇక్కడ వినియోగించామని తెలిపింది. 

న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికలకు సరిగ్గా రెండు రోజులు ముందు కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. దక్షిణాఫ్రికాలో వాడిన ఈవీఎంలను రీ వ్యాలిడేషన్, రీ వెరిఫికేషన్ చేయకుండానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోహరించారనే వార్తలు తమకు అందాయని, ఆ వార్తలపై క్లారిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ ఆరోపణలపై ఎన్నికలు ముగిసిన తర్వాత తాజాగా ఈసీ స్పందించి వివరణ ఇచ్చింది. 

ఆ ఆరోపణలు అవాస్తవాలని ఎన్నికల సంఘం తాజాగా వివరణ ఇచ్చింది. మన ఈవీఎంలను ఎప్పుడు కూడా దక్షిణాఫ్రికాకు పంపలేదని స్పష్టం చేసింది. అసలు ఆ దేశంలో ఎన్నికలకు ఈవీఎంలు వినియోగిస్తారా? దక్షిణాఫ్రికాలో ఎలక్షన్‌లలో ఈవీఎంలను ఉపయోగించరని తెలిపింది. ఈ ఫ్యాక్ట్‌ను సులువుగా దక్షిణాఫ్రికా ఎలోక్టరల్ కమిషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించింది. దక్షిణాఫ్రికాలోగానీ, ప్రపంచంలోని మరే దేశంలోనైనా మన ఈవీఎంలు ఉపయోగించలేదని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలను వినియోగించామని తెలిపింది. ఈసీఐఎల్ నుంచి వచ్చిన కొత్త ఈవీఎంలనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించామని వివరించింది.

Also Read: Karnataka election 2023: రేపు ఓట్ల లెక్కింపు.. భారీ భద్రత.. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

జాతీయ పార్టీకి చెందిన ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుందని తెలిపింది. అయితే, ఎన్నికలకు రెండు రోజుల ముందే మే 8వ తేదీన ఈ ప్రశ్నను కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా అడిగారని వివరించింది. కానీ, అప్పుడు సైలెన్స్ పిరియడ్ అమల్లోకి వచ్చిందని, అందుకే తాము సమాధానం ఇవ్వలేదని తెలిపింది. 

అంతేకాదు, అలాంటి వదంతులు తీసుకువచ్చిన వారిపై చర్యలు తీసుకోవచ్చని కాంగ్రెస్‌కు సూచించింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ రెప్యుటేషన్ దెబ్బతినకుండా ఉంటుందని వివరించింది.